రామమందిరానికి వచ్చిన విరాళాలను బీజేపీ నేతలు లూటీ చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ గురువారం ఆరోపించారు. ఈ అక్రమ సంపాదన ద్వారా కర్ణాటకలోని కొందరు వ్యక్తులు కూడా లబ్ధి పొందారని ఆయన పేర్కొన్నారు.
మీడియాతో మాట్లాడిన ఆయన, “గతంలో దేవాలయాలలో ‘చెప్పుల దొంగలున్నారు జాగ్రత్త’ అని బోర్డులు పెట్టేవారు, కానీ ఇప్పుడు ‘హుండీ దొంగలున్నారు జాగ్రత్త’ అనే బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది” అని ఎద్దేవా చేశారు. SIT విచారణపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆయన, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో ఈ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
ఆలయ విరాళాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. రాముడి పేరుతో బీజేపీ లూటీ చేసింది, దీనిపై విచారణ చాలా నెమ్మదిగా సాగుతోంది. ఆ రూ. 200 కోట్లు ఎక్కడికి వెళ్లాయనే దానిపై తక్షణమే దర్యాప్తు జరగాలి అన్నారు. శివకుమార్ మరింతగా మాట్లాడుతూ…కర్ణాటకలోని కొందరు కూడా ఈ నిధులను అందుకున్నారు. ఇక్కడ ‘గోవధ నిషేధ బిల్లు’ను ఆమోదించినందుకు బహుమతిగా మరికొందరికి అవార్డులు కూడా ఇచ్చారు అని ఆరోపించారు.
స్వతంత్ర దర్యాప్తును డిమాండ్ చేస్తూ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీనిని నిరూపించాలి. SIT (ప్రత్యేక విచారణ బృందం) అనేది కేవలం మనల్ని బురిడీ కొట్టించడానికే. నిందితులను జైలుకు పంపాలి అన్నారు. మరోవైపు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జూలై 6న ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఇందులో ట్రస్ట్ సీనియర్ సభ్యులైన మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ మరియు ట్రస్టీ అనిల్ మిశ్రాల భవిష్యత్తుపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ఈ నిధుల దుర్వినియోగం వెలుగులోకి వచ్చి, అది రాజకీయ వివాదంగా మారిన తర్వాత జూన్ 27న రాయ్ మరియు మిశ్రా ఇద్దరూ..నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వారిని ట్రస్ట్ నుండి తొలగించే ప్రతిపాదనను ఈ సమావేశంలో పరిశీలించే అవకాశం ఉందని సమాచారం.
Also Read:నాగబంధం..చాలా కాస్ట్లీ సినిమా!
ఆలయ విరాళాల దుర్వినియోగంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక విచారణ బృందానికి (SIT) దర్యాప్తును కొనసాగించడానికి అదనంగా 15 రోజుల సమయం మంజూరు చేశారు. కేసులో ఇంకా కీలకమైన కోణాలు వెలుగులోకి రావాల్సి ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు దీని ద్వారా తెలుస్తోంది.

