Revanth:డబ్బులుంటేనే రాజకీయాలు సరికాదు

32
- Advertisement -

డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా గెలవచ్చని, అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని చెప్పారు సీఎం. ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని తెలిపారు. శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ అలుమ్నీ మీట్, గ్రాడ్యుయేషన్ డేలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కఠోర దీక్షతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిని అయ్యానని, ఎంతో మంది పోటీలో ఉన్నా కూడా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

వివేక్, వినోద్ రామాయణంలో లవకుశుల లాంటివారని కొనియాడారు. ఎంత సంపాదించామనేది కాదు.. సమాజానికి ఎంత పంచామనేది సామాజిక బాధ్యత అనేది కాకా విధానమన్నారు. అటువంటి కాకా వెంకటస్వామి వర్థంతి రోజు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం గొప్ప కార్యక్రమమని అన్నారు. గత 50 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చి దిద్దిన ఘనత కాకా సొంతమని వ్యాఖ్యానించారు. దేశ నిర్మాణంలో ఆయన వారి సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యనందిస్తున్న ఘనత కాకా కుటుంబానిదన్నారు.

తెలంగాణ ఉద్యమంలో కాకా ఫ్యామిలీ ముందుందన్న సీఎం రేవంత్ .. ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీస్ కూడా కాకా పేరునే ఉందని తెలిపారు. దేశ నిర్మాణంలో కూడా కాకా పాత్ర ఉందన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎలానో తెలంగాణకు కాకా కుటుంబం అలా అని చెప్పుకొచ్చారు. బీఆర్ అంబేద్కర్ కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం నుంచి చేయూతనందించేందుకు సిద్దమని రేవంత్ హామీ ఇచ్చారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు తాము అండగా ఉంటామన్నారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధిపై కృషి చేస్తామని తెలిపారు. కళాశాల సమయంలో భవిష్యత్ కు బంగారు పునాదులు వేసుకోవాలని సూచించారు. విద్యార్థి దశలోనే వీలైనంత ఎంజాయ్ చేస్తూనే భవిష్యత్ వైపునకు సరైన దిశలో అడుగులు వేయాలని చెప్పారు. ముఖ్యంగా డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లకు బానిస కాకూడదని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తమ ప్రభుత్వానిది అని అందుకే విద్యార్థులంతా మంచిగా చదువుకుని సర్కార్ కొలువు సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంతకుముందు కాలేజీలో కాకా విగ్రహాన్ని సీఎం రేవంత్ అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

Also Read:సలార్..ఓటీటీలో ఎప్పుడో తెలుసా?

- Advertisement -