ఈసారి జాతీయ గ్యారెంటీలు!

17
- Advertisement -

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి గ్యారెంటీలనే నమ్ముకుందా ? అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గ్యారెంటీలతో పేరుతో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ లోక్ సభ ఎన్నికల్లో కూడా అధికారం కోసం సేమ్ స్ట్రాటజీని అప్లై చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఈసారి లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకు డూ ఆర్ డై లాంటివి కావడంతో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకోసం ఇతర పార్టీలను కూడా కలుపుకొని కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కూటమిలో అనిశ్చితి నెలకొనడంతో అనుకున్న స్థాయిలో దూకుడు కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో కూటమితో సంబంధం లేకుండా ప్రజల దృష్టిని ఆకర్శించేందుకు కాంగ్రెస్ సిద్దమైనట్లు తెలుస్తోంది.

అందులో భాగంగానే మేనిఫెస్టో రూపకల్పనపై ఫోకస్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్యారెంటీల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న గ్యారెంటీల మాదిరిగానే దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాతీయ గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. దీంతో కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గ్యారెంటీల పేరుతో అమలుతున్న హామీలనే మళ్ళీ జాతీయ స్థాయిలో ప్రకటించే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్దం చేస్తోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ అమలు చేస్తున్న గ్యారెంటీల విషయంలో కొంత అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం అయిందనే విమర్శలు కూడా అడపా దడపా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ జాతీయ గ్యారెంటీల పేరుతో అవే హామీలను లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటిస్తే కాంగ్రెస్ కు ఇబ్బందే అనేది కొందరి అభిప్రాయం. మరి గ్యారెంటీలనే నమ్ముకున్న కాంగ్రెస్ కు లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో చూడాలి.

Also Read:లక్నోలో మిస్టర్ బచ్చన్..

- Advertisement -