ఈ నెల 22న యాదాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి సీఎం వెళ్లనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో వాసాలమర్రిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, వాసాలమర్రి గ్రామ సర్పంచ్ అంజయ్యకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు.

ఊరంతా సామూహిక భోజనం చేద్దామని సర్పంచ్కి కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. అనంతరం గ్రామ సభ ఏర్పాటు చేసుకొని.. గ్రామ సమస్యలపై చర్చిద్దామని సర్పంచ్తో మాట్లాడారు. సామూహిక భోజన ప్రదేశం, గ్రామ సభ నిర్వహణకు పెద్ద ఖాళీ స్థలాన్ని చూడాలని సర్పంచ్ అంజయ్య కేసీఆర్ సూచించారు.
వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ నెలలో జనగామ జిల్లా కొడకండ్లలో పర్యటన ముగించుకుని తిరుగు పయనమైన సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో ఆగి, గ్రామాభివృద్ధిపై స్థానికులతో చర్చించిన సంగతి తెలిసిందే.