పల్లె ప్రగతి పురోగతిపై తనిఖీ- సీఎం కేసీఆర్‌

541
cm
- Advertisement -

పల్లె ప్రగతి కార్యక్రమాల పనితీరును పరిశీలించేందుకు జనవరి ఒకటో తేదీ నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగనున్నాయనీ.. రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల పురోగతిని వాటి నాణ్యతను ఈ స్క్వాడ్స్ అకస్మికంగా తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదికలు అందించనున్నాయని.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పల్లె ప్రగతి కార్యక్రమ పురోగతిపై ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. స్వచ్చతకు అద్దం పడుతూ పచ్చనైన పరిశుభ్రమైన పల్లెల కోసం ప్రభుత్వం సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభించి ప్రతిష్టాత్మకంగా అమలు పరిచిన 30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమం జనాదరణ పొందిందన్నారు. పల్లె ప్రగతిలో స్థానికులు భాగస్వామ్యం పంచుకోవడం శుభపరిణామ మన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం సత్పలితాలను ఇవ్వడం సంతోషకరమని అన్నారు.

అయితే…ప్రజలు చూపిస్తున్నంత ఉత్సాహాన్ని అధికారులు ప్రజా ప్రతినిధులు చూయించట్లేరనే ఫిర్యాదులు సూచనలు తనకు క్షేత్ర స్థాయినుంచి అందుతున్నాయని సిఎం అన్నారు. ఇంకాకూడా వందశాతం ఫలితాలను రాబట్టాలంటే తనిఖీలు నిర్వహించడం ద్వారా, దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం వుంటుందని సిఎం తెలిపారు. పరిస్థితులను బట్టి పల్లె ప్రగతి కార్యక్రమ పురోగతిని తనిఖీచేస్తామని, కార్యక్రమం ప్రారంభంలోనే చెప్పినట్టు సిఎం గుర్తుచేశారు. అందులో భాగంగా ప్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి పనితీరు మెరుగుపరుచుకోని అధికారులు, ప్రజా ప్రతినిధుల మీద చర్యలు తీసుకుంటామని సిఎం స్పష్టం చేశారు.

పంచాయితీరాజ్ శాఖ లో పనిచేసే అన్ని స్థాయిల్లోని సిబ్బందికి వారి జీవితంలో ఊహించని విధంగా పదోన్నతులను కల్పించామని, గ్రామ కార్యదర్శుల నియామకం చేపట్టడం నుంచి ఎంపీవో, ఎంపీడీవో, డిఎల్పీవో, డిపీవో, జిల్లా పరిషత్ సీఈవో, డిప్యుటీ సీఈవో అన్ని స్థాయిల్లో వ్యవస్థను పటిష్టపరిచి, శాఖను సజీవంగా తీర్చిదిద్దామని సిఎం అన్నారు. అయితే ఇంతగనం బలోపేతం చేసిన తర్వాత కూడా ఫలితాలు మెరుగ్గా రావాలని ప్రభుత్వం ఆశించడం సహజమేనని సిఎం అభిప్రాయపడ్డారు. పల్లె ప్రగతిలో భాగంగా, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెలా 339 కోట్ల రూపాయలను టంచనుగా ప్రభుత్వం విడుదల చేస్తున్నదని చెప్పారు.

పల్లెను అభివ్రుద్ది పథంలో నడిపించే దిశగా ఆయా జిల్లాకలెక్టర్లను నిరంతరం అప్రమత్తం చేస్తూ తగు సూచనలు ఇస్తున్నామని, పంచాయితీ రాజ్ చట్టంలోకూడా కలెక్టర్లకు ఆమేరకు అధికారాలను దఖలు పరిచామని సిఎం అన్నారు. పచ్చదనం పారిశుద్యతను మెరుగుపరిచేందుకు గ్రామస్థాయిలో పని వ్యవస్థలను కూడా పటిష్టం చేసినామని, గ్రామోద్యోగుల జీతాలు కూడా పెంచినామని, అందుకు సంబంధించి స్కీంలను కూడా అమలుపరుస్తున్నమన్నారు. ఇన్ని రకాల చర్యలు తీసుకున్న తర్వాత కూడా పల్లెల్లో ప్రగతి అనుకున్నవిధంగా ముందుకు పోకపోతే అది కలెక్టర్లు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులదే బాద్యత అని స్పష్టం చేశారు.

KCR

‘‘పల్లెలను బాగుచేసుకోవడం కన్నా ప్రభుత్వానికి మించిన పనిలేదు. అధికారుల మీద ప్రజా ప్రతినిధుల మీద విశ్వాసంతోనే, వారికి కావాల్సినంత వెసులు బాటును సమయాన్ని ఇచ్చినం. అందుకే తనిఖీల కోసం ఆత్రపడలేదు. అయితే ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని భావిస్తున్నం. వచ్చేవారంలో రానున్న నూతన సంవత్సరం జనవరి మొదటి తేదీ నుంచి పల్లె ప్రగతి తనిఖీ కార్యక్రమం ప్రారంభించనున్నాం. ఇది ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు, ఫ్లయింగు స్క్వాడ్స్ తనిఖీలు నిర్వహించి నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందచేయడానికి మాత్రమే..’’ అని సిఎం వివరించారు.
ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, మూడు క్యాడర్ల నుంచి ఉన్నతాధికారులను నియమించి తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రతి అధికారికి రాండమ్ పద్దతిలో వివిధ జిల్లాల్లోని 12 మండలాల చొప్పున అకస్మిక తనిఖీకోసం బాధ్యతలను అప్పగిస్తామని సిఎం తెలిపారు. ఎవరికి ఏమండలాన్ని అప్పగిస్తామనేది ప్రభుత్వం గోప్యంగా వుంచుతుందన్నారు. అకస్మికంగా విడతల వారీగా నిర్వహించే తనిఖీల ద్వారా పల్లె పురోగతి క్రాస్ చెక్ అవుతుందని తద్వరా ప్రభుత్వానికి సరైన సూచనలు సలహాలు అందుతాయన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో అలసత్వం వహించినట్టు రుజువయిన అధికారుల మీద, వంద శాతం పనిచేయని సర్పంచుల మీద, తగు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఏమాత్రం శషబిషలు కానీ మొహమాటాలు కానీ వుండని సిఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా అసలత్వం వహించినట్టు తేలిన అధికారలును క్షమించే ప్రసక్తేలేదన్నారు. వారిపై కఠిన చర్యలుంటాయన్నారు.

తనిఖీల కార్యాచరణను వివరిస్తూ ముఖ్యమంత్రి … ’’ ప్లయింగ్ స్క్వాడ్స్ లు చేపట్టే అకస్మిక తనిఖీల ద్వారా, పల్లె ప్రగతి కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ప్రదర్శించిన చిత్తశుద్దిని వారి శక్తి సామార్థ్యాలను ప్రభుత్వం అంచనా వేస్తది. ఇది పంచాయితీ రాజ్ అధికారులకు, ప్రజా ప్రతినిధుల పనితీరుకు ఓ పీరీక్ష వంటిదే. నూతన నియామకాలు చేపట్టి వారికి పదోన్నతులు ఇచ్చి అధికార వ్యవస్థను ఏర్పాటు చేసి, కావాల్సినంత ఆర్థిక వనరులను అందుబాటులోకి తెచ్చిన తర్వాత కూడా… ఇటు వీల్లు అటువాల్లు వున్నంక కూడా… గ్రామాల్లో అనుకున్నమేర పని జరగకపోతే దానికి అర్థం లేదు. ఇంత జరిగినంక కూడా గ్రామాలు బాగుపడకపోతే ఇక జీవితంలో అవి బాగుపడవు. అట్లా కావాడానికి వీల్లేదు’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

గ్రామాలన్ని అద్దంలా తీర్చిదిద్దేవరకు ఎట్టి పరిస్థితిల్లో ప్రభుత్వం విశ్రమించదని సిఎం గట్టిగా చెప్పారు. తాను పల్లె ప్రగతి కార్యక్రమం గురించి ప్రభుత్వం సీరియస్ నెస్ ను వివరించిన ముఖ్యమంత్రి.. అత్యవసర పనిమీద బెంగుళూరు వెల్లవలసిన పంచాయితీరాజ్ కమీషనర్ రఘనందన్ రావు ప్రయాణాన్ని వాయిదావేయించి మరీ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నం…అంటె అర్థం చేసుకోవాలె..అని అన్నారు. ఈ కార్యక్రమంలో .సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, సిఎం ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర రెడ్డి, పంచాయితీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, డైరక్టర్ శ్రీదేవి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -