ఏపీకి ధీటైన సమాధానం చెప్పాలి: సీఎం కేసీఆర్

235
cm kcr
- Advertisement -

వచ్చే నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలను, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను తీసుకొని సమావేశానికి రావాల్సిందిగా అధికారులను సిఎం ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నదీ జలాల విషయంలో కావాలనే కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. అపెక్స్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న వాదనలకు ధీటైన సమాధానం చెప్పాలి. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్ధలు కొట్టినట్లు స్పష్టం చేయాలి. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని, ఏడు సంవత్సరాల అలసత్వాన్ని ఈ సమావేశంలో తీవ్రంగా ఎండగట్టాలి. తెలంగాణ ప్రజల హక్కులను హరించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాలి. నిజానిజాలను ఈ సమావేశం సందర్భంగా యావత్ దేశానికి తేటతెల్లం చేయాలి’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.

రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి నీటిని కేటాయించాలి. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడితే జూన్ 14న ప్రధాన మంత్రికి లేఖ రాశాము. తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాంయిపులు జరపాలని కోరాము. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్పూట్ యాక్ట్ 1956 సెక్షన్ 3 ప్రకారం ప్రత్యేక ట్రిబ్యునల్ వేసైనా, లేదంటే ఇప్పుడున్న ట్రిబ్యునల్ ద్వారా అయినా తెలంగాణాకు నీటి కేటాయింపులు జరపాలని కోరాము. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్యనైనా, లేదంటే నదీపరివాహక ప్రాంతాల్లోని మొత్తం రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరపాలని కోరాము. ఏడేళ్ల సమయం వచ్చినా ప్రధానమంత్రికి రాసిన లేఖకు ఈనాటికి స్పందన లేదు. కేంద్ర ప్రభుత్వం నుండి ఉలుకు లేదు పలుకు లేదు. పైగా అపెక్స్ సమావేశాల పేరిట ఏదో చేస్తున్నట్టనిపిస్తున్నారు. కానీ కేంద్రం ఏమీ చేయడం లేదు. అక్టోబర్ 6 న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా గట్టిగా ఎండగట్టాలి. తెలంగాణాకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోరుతున్న న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

- Advertisement -