కాల్వల నిర్వహణకోసం సమగ్రవ్యూహం:సీఎం కేసీఆర్

294
kcr review
- Advertisement -

ఇప్పటిదాకా కరువు ప్రాంతంగా ఉన్నతెలంగాణలో ఇకపై నిరంతర నీటి ప్రవాహం ఉంటుందని, దీనికి తగినట్లుగానే కాల్వల నిర్వహణ కోసం సమగ్ర వ్యూహం రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది జూలై నుంచే నీటిని ఎత్తిపోయడం ప్రారంభిస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. బ్యారేజిలు, రిజర్వాయర్లు, కాల్వలు, డిస్ట్రిబ్యూటర్లు, తూములను నిర్వహించడానికి సర్వసన్నద్ధం కావాలని చెప్పారు.

తెలంగాణ ఇప్పటి వరకు కరువు ప్రాంతం. సాగునీటికి అష్టకష్టాలు పడిన నేల. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాల్వలతో పాటు, ఇతర కాల్వలలో మూడు నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే నామమాత్రంగా నీళ్లు వచ్చేవి. దీంతో నీటి ప్రవాహాన్ని పంట పొలాల వరకు తరలించేందుకు అనుగుణంగా కాల్వల నిర్వహణను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతుంది. తెలంగాణలో వర్షం పడకున్నా సరే, ప్రాణహిత ద్వారా గోదావరిలోకి పుష్కలంగా నీళ్లు వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది జూలై నుంచే నీటిని ఎత్తిపోయడం ప్రారంభం అవుతుందన్నారు.

మేడిగడ్డ నుంచి సుందిళ్ల, అన్నారం ద్వారా మిడ్ మానేరు, ఎల్లంపల్లికి అక్కడి నుంచి అటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు, ఇటు మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ వరకు నీరు పంపింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ అప్రమత్తం కావాలి. మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఎల్లంపల్లి, శ్రీరాం సాగర్ రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీరు నింపుతాం. ఆ జలాశయాల్లో గేట్లు, తూములు ఎలా ఉన్నాయో పరిశీలించి, అవసరమైన మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలి. ఎప్పుడంటే అప్పుడు గేట్లు తీసి వేసేలా సిద్ధం చేయాలి. వరద కాలువ, కాకతీయ కాలువ, లక్ష్మి కాలువ, సరస్వతి కాలువ, గుత్ప కాలువలు, అలీ సాగర్ కాల్వలన్నింటినీ సిద్ధం చేయాలి. ఈ కాలువల తూములు, డిస్ట్రిబ్యూటరీలు, రెగ్యులేటర్లు ఎలా ఉన్నాయో పరిశీలించి, అవసరమైన మరమ్మతులను వచ్చే 20 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. దీనికి కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తాం. నీటి మళ్ళింపు పనులు పర్యవేక్షించేందుకు అవసరమైన లస్కర్లను నియమించుకోవాలని సూచించారు.

కాల్వల మొదటి నుంచి చివరి వరకు కూడా నీటి ప్రవాహానికి అనుగుణంగా అన్ని వ్యవస్థలను సర్వసన్నద్ధం చేయాలి. కాల్వల వెంట పూర్తి సామర్థ్యంలో నీటి ప్రవాహం ఉంటుంది కాబట్టి రెండు వైపులా ఒడ్డులు పటిష్టంగా ఉండేట్లు చూడాలి. దీనికోసం నీటి పారుదల శాఖ ఇంజనీర్లతో వర్కు షాపు ఏర్పాటు చేసి, విధానాన్ని ఖరారు చేయాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తి రిజర్వాయర్లకు తరలించే క్రమంలో కొన్ని బాలారిష్టాలు ఎదురవుతాయి. వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలను ఎప్పటికప్పుడు చేపట్టాలి. బ్యారేజిల నుంచి రిజర్వాయర్లకు, చెరువులకు నీళ్లు పంపించే క్రమంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి. బ్యారేజిల నుంచి రిజర్వాయర్లకు నీరంది, రిజర్వాయర్ల నుంచి పంట పొలాల వరకు నీరు చేరే వరకు కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండి, ఎక్కడికక్కడ పనులు నిర్వహించాలి అని సిఎం చెప్పారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటి పారుదల శాఖ ఇఎన్సిలు మురళీధర్, హరేరామ్, సిఇలు ఖలేందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -