అవినీతికి ఆస్కారం లేని కొత్త అర్బన్ పాలసీ-సీఎం కేసీఆర్

256
Kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర నూతన అర్బన్ పాలసీ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. అవినీతికి ఆస్కారం లేని విధంగా, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందే విధంగా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ది జరిగేలా తెలంగాణ రాష్ట్ర నూతన అర్బన్ పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అర్బన్ పాలసీతో పాటు కొత్త రూరల్ పాలసీ, కొత్త రెవెన్యూ పాలసీ కూడా రూపొందించాలన్నారు. నూతన అర్బన్ పాలసీలో భాగంగా నూతన మున్సిపల్ చట్టం, నూతన కార్పొరేషన్స్ చట్టం, నూతన హైదరాబాద్ నగర కార్పొరేషన్ చట్టం తీసుకురావాలని, హెచ్ఎండబ్ల్యుఏతో పాటు ఇతర నగరాల అభివృద్ధి సంస్థల పాలనకు సంబంధించి కూడా కొత్త చట్టం రూపొందించాలని చెప్పారు. రెండు మూడు రోజుల్లోనే ఈ చట్టాల డ్రాఫ్ట్ తయారు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను కోరారు.

త్వరలోనే అసెంబ్లీని సమావేశ పరిచి కొత్త చట్టాలు తెస్తామని వెల్లడించారు. అవినీతి జరగడానికి ఏమాత్రం ఆస్కారం కలిగించని విధంగా, అక్రమ కట్టడాలకు ఏమాత్రం వీలులేని విధంగా, పచ్చదనం-పరిశుభ్రత వెల్లివిరిసే విధంగా నగరాలు, పట్టణాలను తీర్చిదిద్దడానికి ఉపయోగపడే విధంగా కొత్త చట్టాలు ఉండాలని నిర్దేశించారు. ఈ చట్టాల ప్రకారమే నగర పాలన జరిగే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధ్యత అప్పగించాలని నిర్ణయించినట్లు సిఎం చెప్పారు. బాధ్యతలను విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా చట్టమే కల్పిస్తుందని సిఎం స్పష్టం చేశారు.

cm kcr

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పరిస్థితిని చక్కదిద్దే బృహత్తర ప్రయత్నంలో కలెక్టర్లు క్రియాశీల బాధ్యత పోషించేలా చట్టంలో నిబంధనలు పెడతామని చెప్పారు. ఎవరిష్టం వచ్చినట్లు వారు నిధులు ఖర్చు చేయకుండా, ఆయా నగరాలు, పట్టణాల ప్రాధాన్యతలు, సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం మాత్రమే నిధులు వెచ్చించాలని వివరించారు. మున్సిపాలిటీలకు ఆదాయం రావాలని, వచ్చిన ఆదాయం సద్వినియోగం కావాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఓ పద్దతి ప్రకారం నగర–పట్టణ పాలన సాగేందుకు నూతన పాలసీ, కొత్త చట్టాలు ఉపయోగపడాలని వివరించారు.

‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే, రాష్ట్ర ప్రాధాన్యతలు గుర్తించాం. సంక్షేమ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించుకున్నాం. మంచినీళ్ళ సమస్యను తీర్చుకున్నాం. సాగునీటి కోసం ప్రాజెక్టులు కడుతున్నాం. పారిశ్రామికాభివృద్ధి కోసం టిఎస్ ఐపాస్ చట్టం చేసుకున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మరో మెట్టు ఎక్కాలి. దీనికోసం మంచి విధానాలు రావాలి. కొత్తగా పంచాయతీ రాజ్ చట్టం చేసుకున్నాం. ఇదే విధంగా రెవెన్యూ, మున్సిపల్ చట్టాలు కూడా రావాలి. పరిపాలన పారదర్శకంగా, వేగంగా, అవినీతికి ఆస్కారం లేని విధంగా సాగాలి’’ అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ రాజ్ సమ్మేళనాలు తెలంగాణ పల్లెలు పచ్చదనంతో, పరిశుభ్రతతో కళకళలాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, ఎంపిపిలు, జిల్లా పరిషత్ చైర్మన్లు గ్రామాల వికాసానికి పూనుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు, గ్రామాల వికాసానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించడానికి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ రాజ్ సమ్మేళనాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని నాలుగు చోట్ల ఈ సమ్మేళనాలు నిర్వహిస్తామని, సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, ఎంపిపిలు, జడ్పీ చైర్ పర్సన్లతో పాటు పంచాయతీ కార్యదర్శులు, ఇఓపిఆర్డీలు, ఎంపిడివోలు, డిఎల్పీవోలు, సిఇవోలను ఈ సమ్మేళనాలకు ఆహ్వానిస్తామని చెప్పారు. జిల్లా పరిషత్తులను, గ్రామీణ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ఏటా దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలను, ఐదేళ్లలో 35వేల కోట్ల రూపాయలను గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నిధులను సమర్థ వంతంగా వినియోగించుకునే విధంగా స్థానిక సంస్థలు తయారు కావాలని చెప్పారు. గ్రామాలు పచ్చగా, పరిశుభ్రంగా తయారు కావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలనే విషయంలోకూడా సమ్మేళనాలలో చర్చించనున్నట్లు తెలిపారు. సమ్మేళనాల తరువాత అధికారులతో కూడిన 100 ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేస్తామని, అవి గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు జరుపుతాయన్నారు. పచ్చదనం, పరిశుభ్రత విషయంలో అలసత్వం ప్రదర్శించినట్లు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామాల్లో మూడు నెలల్లో మార్పు కనిపించాలన్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఇందుకోసం త్వరలోనే హైదరాబాద్ లో కలెక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించాలని అధికారులకు సిఎం కేసీఆర్‌ చెప్పారు.

ఈ సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఎంఎయుడి డైరెక్టర్ శ్రీదేవి, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు, కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ, సిఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -