మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎవరితో పోటీ లేదన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ భవన్లో ఇవాళ టీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఉన్న 120 మున్సిపాలిటీలు, 10 కార్పోరేషన్లను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే వున్నాయని, ఎలాంటి బెదురు లేకుండా ఎన్నికలకు పార్టీ క్యాడర్ని సమాయత్తం చేయాలని సూచించారు.
బీజేపీ మనకు పోటీ అనే అపోహలు వద్దన్నారు. పార్టీ ఒకసారి అభ్యర్థిని ఫైనల్ చేశాక ఆ అభ్యర్థి గెలుపు కోసమే అందరూ పని చేయాలని సూచించారు. అవసరం ఉన్న చోట మంత్రులు ప్రచారం చేస్తారని, మిగిలిన బాధ్యతంతా ఎమ్మెల్యేలదేనని కేసీఆర్ చెప్పారు.మంత్రులు కూడా మునిసిపల్ ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.