వానాకాలం ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం..

190
kcr cm
- Advertisement -

వానాకాలంలో పంటల కొనుగోళ్లు, యాసంగిలో సాగు విధానంపై సీఎం కేసీఆర్‌ శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమాలకర్‌, సబంధిత అధికారులు పాల్గొన్నారు. వానాకాలం పంట వరిధాన్యం సేకరణ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఏ-గ్రేడ్‌ వరికి రూ.1,888, సాధారణ రకం ధాన్యానికి రూ. 1,868 కనీస మద్దతు ధరను ప్రకటించింది. వరిధాన్యం సేకరణ కోసం 5,690 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది.

ఈ నేపథ్యంలో పౌరసరఫరాల సంస్థ ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, జీసీసీ, ఏఎంసీ కొనుగోలు కేంద్రాల ద్వారా వరిధాన్యం కొనుగోలు చేయనుంది. హాకా ద్వారా 9 జిల్లాల్లో వరిధాన్యం కొనుగోళ్లు జరగనున్నాయి. వానాకాలంలో 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ అంచనా. సీఎంఆర్‌ బియ్యాన్ని 15 రోజుల్లో మిల్లర్లు ప్రభుత్వానికి అందించాలని ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా బియ్యం ఇవ్వని అదేవిధంగా పీడీఎస్‌ బియ్యాన్ని పక్కదారి పట్టించే మిల్లర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలంది. వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

మిల్లర్లు ఇచ్చే బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రభుత్వం వినియోగించనుంది. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. పాత గోనె సంచులను రికవరీ చేయాలంది. ప్రతీ సీజన్‌కు గోనె సంచులు రికవరీ చేసి నెలవారీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ధాన్యం సేకరణ, సంబంధిత అంశాల కోసం టోల్‌ఫ్రీ నంబరు 180042500333, 1967.

- Advertisement -