హైదరాబాద్ వర్సిటీకి పీవీ పేరుపెట్టాలి- కేసీఆర్

190
cm kcr
- Advertisement -

మాజీ ప్రధాని పీవీకి భార‌త‌రత్న ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లోని హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ(హెచ్‌సీయూ)కు మాజీ ప్రధాని పీవీ న‌ర‌సింహారావు పేరు నామ‌క‌ర‌ణం చేయాల‌ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అపార రాజనీతిజ్ఞతకు పర్యాయపదంగా నిలిచిన మేధోసంపన్నుడు,బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సంపన్న భారత దేశం రూపొందడానికి బాటలు నిర్మించిన అసాధారణ నేతగా, స్థితప్రజ్ఞుడిగాఆయన చిరకీర్తిని పొందారు. భారత పూర్వప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి దేశచరిత్రలో ఒక విశిష్ట సందర్భం.తెలంగాణా అస్తిత్వ ప్రతీక, ఆత్మగౌరవ పతాక అయిన పి వి నరసింహారావు శతజయంతి ఉత్సవాలను సంవత్సర కాలం పాటు ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. 2020 జూన్ 28 వతేదీన పి వి జ్ఞానభూమిలో ఘనంగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. ఈ శతజయంతి ఉత్సవాల నిర్వహణ ద్వారా పి వి నరసింహారావు దేశానికి చేసిన సేవలను ప్రజలందరూ ఉజ్వలంగా స్మరించుకునేలా చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్నది.

ఈ రోజు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా భారత దేశం నిలవడానికి, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థలలో ఒకటిగా భారతదేశం పురోగమించడానికి మూలకారకుడు పివి నరసింహారావు. దేశ ప్రధాని పదవిని అధిష్టించిన మొట్టమొదటి దక్షిణభారతీయుడిగా, తెలంగాణ ముద్దుబిడ్డడుగా చరిత్ర సృష్టించిన ఘనుడు పి. వి. నరసింహారావు. అందుకే ఇది పివి మన ఠీవి అని తెలంగాణ సగర్వంగా చాటుకుంటున్న సందర్భం. ఆధునిక భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన నాయకులు ఇద్దరే ఇద్దరు. ఒకరు స్వాతంత్రానంతరం “ జవహర్ లాల్ నెహ్రూ, మోడరన్ ఇండియా నిర్మాత”.రెండవవారు పివి నరసింహారావు, “గ్లోబల్ ఇండియా నిర్మాత”.

పివి నర్సింహారావు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో దేశంసమస్యల సుడిగుండంలో చిక్కి సతమతమవుతున్నది. దేశ ఆర్థికస్థితి అధోగతిలో ఉంది. సోవియట్ అమెరికాల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి అమెరికా కేంద్రంగా ఏకధ్రువ ప్రపంచం ఏర్పడుతున్నసంధికాలంలో అంతర్జాతీయంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాలానుగుణంగా పరిణామశీలంగా ఆర్ధిక దృక్పథంలో మార్పులు తేవాల్సిన ప్రత్యెక పరిస్థితుల నడుమ దేశం నిలబడి ఉన్నది. ఇంకో దిక్కు పంజాబ్‌లో వేర్పాటువాదం బుసలు కొడుతోంది.కశ్మీర్ లో ఉగ్రవాదులు మారణహోమం కొనసాగిస్తున్నారు.వీటన్నిటితో పాటూ మైనారిటీలో ఉన్న ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ రాజకీయ స్థిరత్వాన్ని నెలకొల్పాలి. కాలం విసిరినా ఇన్ని సవాళ్ళ నడుమ తనదైన, దార్శనికతతో, ధైర్యంగా ముందడుగు వేశారు పివి నరసింహారావు. నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి అత్యంత సాహసోపేతంగా వేగంగా, చాకచక్యంగా, సమర్థవంతంగా అమలు చేశారు. రాజకీయాలతో సంబంధం లేని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ని ఆర్థికశాఖ మంత్రిగా నియమించి పివి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సరళీకృత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్నే మార్చేశారు. లైసెన్స్, పర్మిట్ రాజ్ ను అంతంచేశారు. దేశాభివృద్ధిలో ప్రైవేటురంగం భాగస్వామ్యాన్ని పెంచారు. కూపస్థ మండూకంలా మారిన దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేశారు. అభివృద్ధి రేటు సున్నా అవుతున్న విపత్కర పరిస్థితి నుంచి, దేశాన్ని బయటపడవేసి, ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించి పరుగులు తీయించారు.

నేడు భారతీయ మేధావులు విదేశాలలో ఉన్నతోద్యోగాలు చేస్తున్నారన్నా, దేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెద్ద ఎత్తున సమకూరాయన్నా, ఈనాడు దేశానికి ప్రపంచం నలుదిక్కులనుంచీ పెట్టుబడులు తరలి వస్తున్నాయన్నా, స్వదేశీకంపెనీలు విదేశీకంపెనీలను కొనేస్థాయికి ఎదిగాయన్నా, ప్రభుత్వరంగ సంస్థలలో సైతం పోటీతత్వం పెరిగిందన్నా, ప్రైవేటు రంగంలో ఉపాధి పెరిగిందన్నా, సగటు భారతీయుని జీవన శైలి ఎంతో మారిందన్నా వీటన్నిటి వెనకా పివి నరసింహారావు దార్శనికత ఉంది. ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిన సత్యం. పివి నరసింహారావు సంస్కరణలనే వృక్షాలునాటితే ఈనాడు మనం వాటి ఫలాలు అనుభవిస్తున్నాం. అందుకే ఆయన నూతన ఆర్థిక విధానాల విధాత, గ్లోబల్ ఇండియాకు రూపశిల్పి.

భారత విదేశాంగ విధానంలో మేలి మలుపులు పీవీ దౌత్యనీతి ఫలితమే. అంతవరకూ సోవియట్ యూనియన్ తో మాత్రమే సంబంధాలు కలిగిన భారత్ ను ఒకేఒక అగ్రరాజ్యమైన అమెరికాకు మిత్రదేశంగా మార్చిన ఘనత పీవీదే. భారత్ కు వ్యతిరేకంగా, పాకిస్తాన్ కు అనుకూలంగా ఉండిన నాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ ను సుముఖం చేసుకున్నది పీవీ వ్యూహమే. ‘లుక్ ఈస్ట్ పాలసీ’ ప్రవేశపెట్టి సింగపూర్, మలేషియా, ఇండోనేషియా వంటి “ఏషియన్ టైగర్స్”కి భారత్ ని చేరువ చేసి వ్యాపారాభివృద్ధికి దోహదం చేసింది పీవీ దూరదృష్టే. ఇప్పుడు ఆ విధానాన్నే ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’గా కొనసాగిస్తున్నారు. చైనాతో సరిహద్దు సమస్యను పక్కనపెట్టి, వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవాలని ప్రతిపాదించి, బీజింగ్ వెళ్లి ఒప్పందం కుదుర్చుకుని వచ్చింది పీవీనే. దాదాపు మూడు దశాబ్దాలు భారత్-చైనా సరిహద్దు ప్రశాంతంగా ఉండటానికి పీవీ దౌత్యమే కారణం.

రెండో అణుపరీక్షకి రంగం సిద్ధం చేసిన దక్షత కూడా పి.వి గారిదే. ఉగ్రవాదుల పీచమణచడంలో సమర్థవంతుడైన పోలీసు అధికారిగా పేరుతెచ్చుకున్న కేపీఎస్ గిల్ కు సంపూర్ణ మద్దతు, వ్యూహాత్మకమైన తోడ్పాటు అందించడం ద్వారా పంజాబ్ లో శాంతిని పునరుద్ధరించారు.కె ఆర్ వేణుగోపాల్ వంటి సమర్థులైన అధికారుల సహకారంతో కాశ్మీర్ లో శాంతి నెలకొల్పగలిగారు. పివీ భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. కానీ ఆయనే భూ సంస్కరణలకు నాంది పలికారు. దేశంలో భూసంస్కరణలను అత్యంత నిజాయితీగా అమలు చేసిన ముఖ్యమంత్రి ఆయన.1972లో భూసంస్కరణల చట్టం తెచ్చారు.

భూస్వామ్య వర్గం కన్నెర్రచేసినా లెక్కచేయలేదు. భూగరిష్ట పరిమితి దాటిన వారు భూములు ప్రభుత్వానికి అప్పజెప్పాలనే విధానాన్ని రూపొందించారు. భూ సంస్కరణల స్ఫూర్తికి తనే ఆదర్శంగా నిలవాలని తన స్వంతభూమి 800 ఎకరాలు ప్రభుత్వానికి స్వాధీనం చేసారు. ఆభూమిని 479 మంది లబ్దిదారులకు అందేలా చూసారు. పి వి చలువవల్లనే తెలంగాణాలో పేదవాళ్ళకు భూమి లభించింది. 93 శాతానికి పైబడి చిన్న కమతాలున్న రైతుల వ్యవసాయ వ్యవస్థ పివి నేతృత్వంలో జరిగిన భూ సంస్కరణల కారణంగానే ఏర్పడ్డది.భూసంస్కరణలను చిత్తశుద్ధితో అమలుచేసినందుకు, ముల్కీ రూల్స్ ను సమర్ధించినందుకు తదనంతరం ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారు. అయినా పివి చలించలేదు. నిబద్ధతను కోల్పోలేదు. రాష్ట్రమంత్రిగానూ, కేంద్రమంత్రిగానూ ఏ శాఖ నిర్వహించినా అందులో సంస్కరణలు ప్రవేశపెట్టిన సృజనశీలి. నిత్య సంస్కరణాభిలాషి పివి నరసింహారావు. అనన్యసామాన్యమైన మేధో సంపత్తి, సామాజిక సమస్యల పట్ల లోతైన అవగాహన ఉన్న పివి వివిధ శాఖలలో అనేక అభివృద్ధికరమైన సంస్కరణలను ప్రవేశపెట్టారు.

రాష్ట్ర విద్యామంత్రిగా గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. కేంద్రంలో మానవ వనరుల శాఖ మాంత్రిగా నవోదయ పాఠశాలలు నెలకొల్పారు.ఈ విద్యాలయాలు గ్రామీణ విద్యార్థులకు నేటికీ ఉచితంగా ఉన్నత ప్రమాణాల విద్యను అందిస్తున్నాయి.ఈ విద్యాలయాలలో శిక్షణ పొందిన వారెందరో ఉన్నత స్థాయి పదవులు పొందారు. ఉన్నత ఉద్యోగాలలో రాణించారు. నేటికీ రాణిస్తున్నారు. ఏడు నుండి పదవతరగతి వరకు మధ్యన ఉండే తరగతులలో డిటెన్షన్ పద్ధతిని రద్దు చేసారు. పిల్లలు జీతగాళ్ళుగా, బాలకార్మికులుగా డ్రాప్ ఔట్స్ గా మిగిలిపోతున్నరనే ఉద్దేశ్యంతో మానవీయ కోణంలో ఆలోచించి, ఆయన ఈ సంస్కరణ చేసారు. అన్ని కోర్సుల అకడమిక్ పుస్తకాలన్నీ తెలుగులో లభించాలనే ఉద్దేశ్యంతో తెలుగు అకాడమీని నెలకొల్పారు.

జైళ్ల మంత్రిగా బహిరంగ జైళ్ల విధానం ప్రవేశపెట్టారు. శిక్షార్హులలో, ఖైదీలలో పరివర్తనకు ఓపెన్ జైళ్ళు ఉపయోగపడతాయని విశ్వసించిన మానవీయమూర్తి పి. వి. విదేశాంగ మంత్రిగా ఇజ్రాయెల్ ను గుర్తించి ఆ దేశంతో ప్రప్రథమంగా దౌత్యసంబంధాలు నెలకొల్పారు. దేశీయాంగ మంత్రిగా, రక్షణ మంత్రిగా విధానపరంగా అనేక కొత్త పుంతలు తొక్కారు. పివి వ్యక్తిత్వం ఒక సహస్రదళపద్మం- అనేక కోణాలున్న సమున్నత వ్యక్తిత్వం. పివి బహుభాషా కోవిదుడు, మహోన్నత సాహిత్యవేత్త. బాలగంగాధర తిలక్, పండిత గోవిందవల్లభ్ పంత్, కే. ఎం. మున్షీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి వారి సరసన లెక్కించదగిన అఖండ పాండిత్యం ఉన్నవాడు. తెలుగు, సంస్కృతం, మరాఠీ, కన్నడం ఉర్దూ పర్షియన్ మొదలైన భారతీయ భాషలతో పాటూ ఇంగ్లీష్, ఫ్రెంచ్ వంటి విదేశీ భాషలలోను అనర్ఘళంగా ప్రసంగించగలిగిన మహాపండితుడు.

రాజకీయాలలో మునిగితేలుతూనే కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు రచించిన “వేయిపడగలు” అనే బృహన్నవలనుహిందీ భాషలోకి “సహస్రఫణ్” పేరుతో అనుసృజించారు.అందరూ వేయి పడగలు నవలకు పి. వి. చేసింది అనువాదం అనుకుంటారు కానీ అది అనుసృజన అని, స్వయంగా విశ్వనాథ సత్యనారాయణ పేర్కొన్నారు. “వేయిపడగలు” నవల అనేక పాత్రలు సన్నివేశాలతో ఒక ఇతిహాసం వలె ఉంటుంది. ‘‘క్లిష్టతరమైన ఈ నవలను పి వి అనుసృజన చేసినతీరు చూస్తే హిందీ నుంచి తెలుగులోకి నేను అనువాదం చేసానా అనేంత గొప్పగా ఉన్నదని’’ విశ్వనాథ సత్యనారాయణ గారంతటి వారు అంతగాప్రశంసించారంటే పి వి పాండిత్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. వేయిపడగలు నవలను బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీద తిరుగుబాటుగా పి.వి. అభివర్ణించారు. “అబలా జీవితం” అనే మరాఠీ నవలను తెలుగులోకి అనువాదం చేసారు.

తెలంగాణా సాయుధ పోరాటంలో తన అనుభవాలకు అక్షర రూపాన్ని ఇస్తూ ‘గొల్ల రామవ్వ’ అనే అత్యద్భుతమైన కథ రాసారు.ఈ కథలో ఆనాడు తెలంగాణాలో రామవ్వ వంటి సామాన్యులు చేసిన త్యాగాలను గొప్పగా చిత్రించారు.ఇంకా ఎన్నో కథలు, పద్యాలు, గేయాలూ, నవలికలూ రాశారు.ఆయన ఉపన్యాసాలలో భాషా సాహిత్య పరిమళాలు, గుబాళించేవి. ఆయన అసమాన పాండిత్యం అద్భుత తేజస్సుతో ప్రకాశించేది. విశ్వనాథ సత్యనారాయణకి, సి నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ పురస్కారాలు లభించడం వెనుక , కాళోజి నారాయణ రావుకి పద్మవిభూషణ్ బిరుదు రావడం వెనుక పి వి కృషి దాగివుంది. మనవాళ్ళ ప్రతిభ జాతీయ స్థాయిలో వెలుగులోకి రావడానికి పివి గారే వారధి అయ్యారు.

ఒక చిన్న గ్రామంలో పుట్టి, విద్యార్థి దశలోనే నిజాం రాజుకు వ్యతిరేకంగా ఉద్యమం చేసినందుకు, విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణ చేసినాకూడా పీవీ వెరవలేదు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర వెళ్లి నాగపూర్, పుణెలో ఇంటర్, బీఎస్సీ, లా డిగ్రీలలో అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. ఆనాడు ప్రముఖ న్యాయవాది, గొప్ప రాజకీయవేత్త అయిన బూర్గుల రాంకిషన్ రావు దగ్గర జూనియర్ లాయర్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటికీ పీవీ, పత్రికా సంపాదకత్వం పట్ల, రామానంద తీర్థ నాయకత్వంలోని స్వతంత్ర పోరాటం పట్లనే మొగ్గు చూపించారు. అద్భుతమైన గ్రహణ, ధారణ శక్తి పీవీ సొంతం. పేదల పట్ల సానుభూతి, ప్రయోగశీలత, పార్టీ పట్లా, ఆదర్శాల పట్లా అంకితభావంతో పివి రాజకీయ ప్రస్థానం సాగించారు. గాంధీ, నెహ్రూల పట్ల ఆరాధానాభావం, అసమాన పాండిత్యం, అసాధారణమైన అభివ్యక్తి, సృజనశీలం ఆయనను ఉన్నత పథంలో నడిపించాయి. ఎన్నో శిఖరాలు ఎక్కించాయి. 1991లో ఎన్నికలలో పోటీ చేయకుండా హైద్రాబాద్ కి తిరిగి రావడానికి సిద్ధంగా ఉండిన పీవీ గారు రాజీవ్ గాంధీ దారుణ హత్యానంతరం అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులై, దేశ ప్రధానిగా సర్వోన్నతమైన పదవిని అధిష్ఠించారు.

ప్రధానిగా భారత దేశాన్ని ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం లో అసమానమైన ప్రతిభతో పాటూ, విమర్శలకు వెరవని సాహసాన్ని ప్రదర్శించారు. అటువంటి మహనీయుడికి, తెలంగాణ ముద్దుబిడ్డకు, ప్రపంచమేధావికి, బహుభాషావేత్తకు, అపర చాణక్యుడికి, ప్రగతిశీలికి, సంపన్న భారత నిర్మాతకు జాతిరత్నమై భాసిల్లిన నాయకునికి మరణానంతరం ‘భారత రత్న’ పురస్కారం ఇచ్చి భారతజాతి తనను తాను గౌరవించుకోవాలి. ఇప్పటికే ఆలస్యం అయింది. పీవీ శతజయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న ఈ సందర్భంలో, వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ప్రకటించడం సముచితంగా ఉంటుంది.

తీర్మానం: తెలంగాణ బిడ్డ, దక్షిణాదినుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థికసంస్కరణల సారథి, అరుదైన దౌత్యనీతికోవిదులు, బహుభాషావేత్త, దేశప్రగతికి ఉజ్వలమైన దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు, భారత రాజకీయాలలో మేరునగధీరుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారికి మరణానంతరం భారతరత్న పురస్కారం ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలనీ, పార్లమెంట్ ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్నీ, చిత్తరువునూ ప్రతిష్ఠించాలనీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పీవీ నరసింహారావుగారి పేరు పెట్టాలనీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.

- Advertisement -