పాఠశాల విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష..

43
- Advertisement -

పాఠశాల విద్యాశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. నూతన విద్యావిధానం అమలుపై అధికారులు సీఎంకు వివరాలు అందించారు. కొత్తగా వర్గీకరించిన ఆరు రకాల స్కూళ్లు, అందులో ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై సీఎంకు వివరాలు అందించారు. 3 కి.మీ.లోపలే హైస్కూల్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని.. ఈ మార్గదర్శకాలను అనుసరించే మ్యాపింగ్‌ చేస్తున్నామన్నారు అధికారులు. రాష్ట్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా అధికారులకు అవగాహన కోసం వర్క్‌షాపు నిర్వహించాం. జిల్లాలస్థాయిలో కూడా నిర్వహించమని కోరారు, ఇవికూడా ఏర్పాటు చేస్తాం. వర్క్‌షాపుల్లో వచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. నూతన విద్యావిధానం వల్ల స్కూళ్లు మూతబడుతున్నాయనే ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. చేస్తున్నది తరగతుల విలీనం తప్ప, స్కూళ్ల విలీనం కాదు. కొత్తగా ఏర్పాటు అవుతున్న స్కూళ్ల వల్ల ఇప్పుడున్న స్కూల్స్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ మూతబడవు.. దీనిపై కొందరు అనవసరంగా అపోహపడుతున్నారు. పాఠశాలల మూసివేత అనేది ఉండదు అని అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే.. వచ్చే విద్యాసంవత్సరం (జూన్‌) నాటికి నూతన విద్యావిధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలన్న సీఎం విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలన్నారు. సబ్జెక్టుల వారీగా టీచర్లు కూడా ఉండాలన్నారు. నూతన విద్యావిధానంలో ఏర్పాటవుతున్న స్కూల్స్‌ కారణంగా సుమారు 22 వేలమందికిపైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వస్తాయన్నారు. వీరందరికీ ఎస్‌జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని.. వీరి సామర్థ్యాలను మెరుగుపరిచేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్కూళ్లలో సరిపడా సిబ్బంది ఉన్నప్పుడే పురోగతి కనిపిస్తుందని సీఎం అన్నారు. ప్రమోషన్లు, బదిలీలు ఇవన్నీకూడా పూర్తిచేసి జూన్‌ నాటికి నూతన విద్యావిధానం సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలి. ప్రతి మండలానికి ఒక హైస్కూల్‌ను జూనియర్‌ కాలేజీగా తీర్చిదిద్దుదామని అనుకున్నాం.. ఇప్పుడు ప్రతి మండలానికి రెండు స్కూళ్లను 2 జూనియర్‌ కాలేజీలుగా మార్చండి అని సీఎం అదేశించారు. ఒకటి కో -ఎడ్యుకేషన్‌ కోసం అయితే, ఒకటి బాలికలకోసం జూనియర్‌ కళాశాలగా మార్చాలి.

ఎస్‌ఈఆర్‌టీ ఇచ్చిన సిఫార్సులు అన్నీకూడా అమల్లోకి రావాలి. మండల రీసోర్స్‌ సెంటర్‌ పేరును మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చేందుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఎండీఓ పరిధిలో కాకుండా ఎంఈవోకే నేరుగా డ్రాయింగ్‌ అధికారాలు కల్పించారు. ఇకపై విద్యాసంబంధిత కార్యకలాపాలు ఎంఈవోకే అప్పగిస్తూ ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సుకు సీఎం ఆమోదం తెలిపారు. ఎంఈఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. పలురకాల ఆప్స్‌ కన్నా… రియల్‌టైం డేటా ఉండేలా, డూప్లికేషన్‌ లేకుండా చూడాలన్న ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సును అమల్లోకి తీసుకురావాలన్నారు సీఎం జగన్‌. అటెండెన్స్‌ను ఫిజికల్‌గా కాకుండా ఆన్‌లైన్‌ పద్ధతుల్లో తీసుకోవాలన్న సిఫార్సునూ అమలు చేయాలన్నారు. విద్యార్ధుల మార్కులనూ ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలన్న ఎస్‌ఈఆర్‌టీ.. పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు నాన్‌ అకడమిక్‌ పనులకు వినియోగించవద్దన్నారు. హెడ్‌మాస్టర్లను పలు రకాల మీటింగులు కాకుండా సమన్వయం కోసం నెలకు ఒకే సమావేశం ఏర్పాటు చేయాలని ఎస్‌ఈఆర్‌టీ సూచించింది. ఈమేరకు వీటికి సీఎం ఆమోదం తెలిపారు.

స్కూళ్ల నుంచి ఫిర్యాదుల పరిష్కారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. సదుపాయాల లేమి, మౌలిక వసతుల మరమ్మతులు తదితర అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. నాడు నేడులో ఏర్పాటు చేసిన ఏ సదుపాయాల్లో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలి. స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్స్, తాగునీరు వీటి నిర్వహణపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు సీఎం. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు- నేడు రెండో విడత పనులపై సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. త్వరగా పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. ఫిబ్రవరి 15 నుంచి పనులు మొదలుపెడుతున్నామన్న అధికారులు.. సెప్టెంబరు కల్లా పనులు పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జగనన్న విద్యాకానుక, టాయిలెట్ల నిర్వహణ, గోరుముద్ద నాణ్యత, స్కూళ్ల నిర్వహణకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయడానికి 14417 టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశారు. ఇది సమర్థవంతంగా పనిచేయాలన్నారు సీఎం జగన్‌.

స్కూళ్లలో కొత్తగా చేరిన విద్యార్ధులకు డిక్షనరీ ఇవ్వాలి.ప్రతిరోజూ ఒక పదాన్ని పిల్లలకు నేర్పాలి.. ఆ పదాన్ని ఎలా ఉపయోగించాలన్నదానిపై పిల్లలకు నేర్పాలని సీఎం ఆదేశించారు. పాఠ్యప్రణాళికలో ఇదొక భాగం చేయాలన్నారు. డిజిటల్‌ లెర్నింగ్‌పైనా కూడా దృష్టిపెట్టాలన్నారు.. 8,9,10 తరగతుల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ ఉండేలా చూడాలని.. దీన్నొక సబ్జెక్టుగా కూడా పెట్టే ఆలోచన చేయాలన్నారు సీఎం జగన్‌. ఈ సమీక్షా సమావేశంలో పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, మహిళా,శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -