పదిహేనేళ్ల తర్వాత కలుసుకున్న హీరో హీరోయిన్..!

310
- Advertisement -

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.అనిల్‌రావిపూడి దర్శకుడు. దిల్‌ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ నెల 11న ప్రేక్షకులముందుకురానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చిరంజీవి.. విజయశాంతి గురించి మాట్లాడారు. “సండే అననురా మండే అననురా ఎన్నడూ నీదాన్నిరా.. అంటూ మాట ఇచ్చి నా మనిషిగా నా హీరోయిన్ గా ఉండకుండా పదిహేనేళ్ల తర్వాత ఇప్పటికి కనిపించింది. విజయశాంతితో హీరోయిన్ గా కంటే ఎక్కువ అనుబంధం ఉంది. మద్రాస్ టీ నగర్ లో మా ఇంటి ఎదురుగానే విజయశాంతి కూడా ఉండేది. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా హాజరవుతూ సొంతమనుషుల్లా మెలిగేవాళ్లం” అని వివరించారు. అంతేకాదు, రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత తనను విజయశాంతి విమర్శించిన వైనాన్ని చిరంజీవి సరదాగా ఓ స్కిట్ రూపంలో ప్రదర్శించారు.

Chiranjeevi “నాకంటే ముందు రాజకీయాల్లోకి వెళ్లావు కదా, నన్ను అన్ని మాటలు అనాలని నీకెందుకనిపించింది?” అని ప్రశ్నించారు. దానికి విజయశాంతి స్పందిస్తూ, “చేయి చూశావా ఎంత రఫ్ గా ఉందో రఫ్పాడించేస్తా జాగ్రత్త” అంటూ నవ్వుతూ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మాట్లాడుతూ, రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఎప్పటికీ మీరు నా హీరో, నేను మీ హీరోయిన్ అంటూ విజయశాంతి భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి తాను విజయశాంతితో నటించిన సినిమాల పాటలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. పదిహేనేళ్ల తర్వాత వచ్చినా నీలో అదే పొగరు, అదే విగరూ శాంతి.. ఏం తగ్గలేదు, చూస్తుంటే ఇక్కడుండాల్సిన గుండె ఇక్కడకి వస్తోంది అంటూ చమత్కరించారు. రాజకీయాలు మనుషుల మధ్య శత్రుత్వాలను పెంచితే, సినిమా రంగం మాత్రమే స్నేహాన్ని పంచుతుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వంశీపైడిపల్లి, కొరటాల శివ, దేవిశ్రీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో చిరంజీవి, విజయశాంతి తమ పాతరోజుల్ని గుర్తుచేసుకొని అభిమానుల్ని ఉత్సాహపరిచారు.

 

- Advertisement -