కుంచిత రాజకీయాల కోసమే ఐటీఐఆర్ రద్దు : కేటీఆర్‌

86
ktra
- Advertisement -

హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామని తాజాగా పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రకటనను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్రంగా తప్పుపట్టారు. కుంచిత రాజకీయాల కోసం ఐటీఐఆర్ రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం, ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంట్ లో నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి దేశ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. బీజేపీ పార్టీ డిఎన్ఏలో నిండి ఉన్న అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్దాలను ఎప్పటిలాగే అలవోకగా కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వల్లె వేశారని కేటీఆర్ విమర్శించారు. రాజకీయంగా వారితో విభేదిస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో హైదరాబాద్‌కు ఐటిఐఆర్ ప్రాజెక్టును రద్దుచేసి మోడీ ప్రభుత్వం, తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దుతో హైదరాబాద్ ఐటీ పరిశ్రమ మరింత ఎదిగే అవకాశాన్ని కొల్పొయిందన్న కేటీఆర్, ప్రస్తుతం హైదరాబాద్ ఐటి పరిశ్రమ సాధిస్తున్న ప్రగతికి కేంద్రం చేసింది ఎం లేదన్నారు. 2008 లో కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం హైదరాబాద్ ఐటీఐఆర్ ఏర్పాటు ప్రతిపాదన చేసి, 2013లో దానికి ఆమోదం తెలిపినా, అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే తెలంగాణకు శనిలా దాపురించిన మోడీ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు, విభజన హమీల మాదిరి హైదరాబాద్ ఐటీఐఆర్‌ను కూడా మూలకుపెట్టిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు తాను కూడా వివిధ సందర్భాల్లో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రులను ఐటీఐఆర్ గురించి అడిగామన్న కేటీఆర్, ఎన్నిసార్లు కోరినా తోలుమందం కేంద్ర ప్రభుత్వంలో చలనం రాలేదన్నారు. మోడీ ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని గుర్తించినంకనే ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సమానస్థాయిలో హైదరాబాద్ ఐటీకి అవసరమైన ఏదైనా పథకాన్ని ప్రకటించాలని కనీసం 50 సార్లు కేంద్రాన్ని కోరమన్నారు కేటీఆర్. అయినా కూడా మోడీ ప్రభుత్వం హైదరాబాద్ ఐటీ ఈకో సిస్టమ్ కు నయా పైసా మందం సహాయం చేయలేదన్నారు. కేంద్రానికి హైదరాబాద్ ఐటి పరిశ్రమ అభివ‌‌ృద్దిపైన చిత్తశుద్ది లేకనే, ఐటిఐఅర్ కు ప్రత్యామ్నాయం చూపలేదని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనాలోచిత, అసంబద్ధ నిర్ణయాలైన నోట్ల రద్దు, కరోనా లాక్ డౌన్, పాలసీ పారలసిస్‌లతో ఏర్పడ్డ ఆర్థిక, సామాజిక సంక్షోభంలోనూ దేశ సగటును మించిన అద్భుతమైన ప్రగతిని తెలంగాణ ఐటీ పరిశ్రమ సాధించిందన్నారు. ఒకవేళ ఐటీఐఆర్ ప్రాజెక్టు ఉండి ఉంటే ఈ ఏడు సంవత్సరాల్లో హైదరాబాద్ ఐటీ ఎకో సిస్టం ఆకాశమే హద్దుగా అద్భుతంగా ఎదిగేదన్నారు.

హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టుకు తాము చేస్తున్న ధోఖాను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ గల్లీ లీడర్లు పూటకో మాట మాట్లాడి ఇన్ని రోజులు పబ్బం గడుపుకున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న మోడీ ప్రభుత్వం, రాజకీయంగా తమకు ప్రయోజనం కాదన్న ఏకైక కారణంతోనే ఐటీఐఆర్‌ను రద్దుచేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఆధునిక భారత్ ను నిర్మించడంపై తమకున్న విధానపర అశక్తతను పార్లమెంట్ లో ఒప్పుకుని తెలంగాణ ఐటీ గ్రాడ్యుయేట్లు, వృత్తి నిపుణులు, యువతకు మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీంతో పాటు ఐటీఐఆర్ రద్దుతో ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో తెలంగాణకు జరిగిన నష్టం పై వివరణ ఇవ్వాలన్నారు.

కేంద్రంలోని వివిధ శాఖలు ప్రవేశ పెట్టిన స్మార్ట్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ లను తెలంగాణకు మంజూరు చేసినందుకే ఐటీఐఆర్ ను రద్దు చేశామని కేంద్రం చెప్పడం వారి ఇంటలెక్చువల్ బ్యాంక్‌రప్టసీకి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. కనీసం ఐటిఐఅర్ రద్దుకు కేంద్రం పెర్కొంటున్న అయా పథకాల్లలోనూ తెలంగాణకి దక్కింది ఏం లేదని కేటీఆర్‌ అన్నారు. ఐటి పరిశ్రమ బలోపేతం కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన పథకాన్ని ఇతర రంగాల్లోని కార్యక్రమాలను చూపి రద్దు చేయడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికున్న విధానపరమైన నిబద్దతకు నిదర్శనమని ఎద్దేశా చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్ లకు లెక్కలేనన్నీ కేంద్ర పథకాలను మంజూరు చేసుకుంటూ, తెలంగాణకు వస్తున్న చారానా, ఆఠానా పనులను కూడా సాకుగా చూపెట్టడం దారుణమన్నారు. ఐటీఐఆర్ కు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు మోడీ ప్రభుత్వం ఇచ్చిందేంటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై ఇక్కడి ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నా… ప్రధాని మోడీలో చలనం రావడం లేదని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా పురోగమిస్తున్న తెలంగాణ ఐటి రంగ ప్రగతిని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న మోడీ ప్రభుత్వ నికృష్ట రాజకీయానికి ఈ మద్యనే ప్రకటించిన సాఫ్ట్ వేర్ పార్క్ లే సాక్ష్యమన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, పంజాబ్, జార్ఖండ్, కేరళ రాష్ట్రాలకు సాఫ్ట్ వేర్ పార్క్ లను కేటాయించిన కేంద్రం, తెలంగాణకు మరోసారి అన్యాయం చేసిందన్నారు. ఈ విషయంలోనూ పలుమార్లు కేంద్రానికి విజ్ఝప్తి చేసినా స్పందనలేదన్నారు. దేశవ్యాప్తంగా 22 సాప్ట్ వేర్ పార్కులను ప్రకటిచించి తెలంగాణకు మెండిచేయి చూపడం బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఉన్న చిన్నచూపుకు నిదర్శనమన్నారు. ఒకవైపు ఐటిఐఅర్, సాప్ట్ వేర్ పార్కుల్లో తెలంగాణకు స్ధానం ఇవ్వని కేంద్రం, తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ టి హాబ్ -2 నిర్మాణాన్ని 450 కోట్లతో పూర్తి చేస్తే, దానికి కేంద్రం నుంచి పైసా సహాయం లేదన్నారు. యువతకు ఉపాది కల్పించే విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముందుచూపు లేదన్నారు. యువతకు ఉపాది కల్పణ, శిక్షణ రంగాల్లో కేంద్రం విఫలమైన విషయాన్ని దేశంలోని యువత,నిరుద్యోగులు గమనిస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. ఇలా తెలంగాణ ఐటి రంగంతోపాటు , అన్ని అంశాల్లో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రం విధానాలను ఇక్కడి యువత గమనించాలన్నారు. మరో వైపు కేంద్రం వివక్ష చూపుతున్న ఉపాది కల్పనలో తెలంగాణ ముందు వరుసలో ఉన్న విషయాన్ని కేటీఆర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పటికైనా దేశ ఐటీ రంగానికి దిక్సూచిగా ఎదుగుతున్న తెలంగాణ ఐటి రంగానికి కేంద్రం ప్రత్యేకంగా ఐటిఐఅర్‌కు సమానంగా ఒక ప్యాకేజీని ప్రకటించి తెలంగాణ పట్ల తమ నిబద్దత చాటుకోవాలని కేటీఆర్ సూచించారు.

- Advertisement -