కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం: కేంద్రం

228
- Advertisement -

కరోనా వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆర్థిక పరిమితులు, ఇతర కారణాల వల్ల ఈ విధంగా నష్టపరిహారాన్ని చెల్లించడం సాధ్యం కాదని ఓ అఫిడవిట్ ద్వారా తెలిపింది. మే 24న సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుపై స్పందిస్తూ ఈ అఫిడవిట్‌ను సమర్పించింది.

‘‘కొవిడ్‌తో చనిపోయినవారికి రూ.4 లక్షల పరిహారాన్ని చెల్లించలేం. భూకంపాలు, వరదలు ఇతర ప్రకృతి విపత్తుల వల్ల నష్టం సంభవిస్తేనే పరిహారం చెల్లించాలని విపత్తు నిర్వహణ చట్టంలో స్పష్టంగా ఉంది’’ అని పేర్కొంది. కరోనాతో మరణించిన ప్రతి ఒక్కరికీ రూ.4 లక్షల చొప్పున ఇస్తూ పోతే విపత్తు నిధులు మొత్తం దీనికే పోతాయని, అవీ చాలవని కేంద్రం తెలిపింది.

రాష్ట్ర విపత్తు ఉపశమన నిధులను మొత్తం దానికే ఖర్చు చేస్తే.. రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణ ఏర్పాట్లకు నిధులుండవని చెప్పింది. అంతేగాకుండా తుఫాన్లు, వరదల వంటివి వచ్చినప్పుడు వాటి కోసమూ నిధులు కావాల్సి ఉంటుందని కేంద్రం కోర్టుకు చెప్పింది. కాబట్టి.. కరోనాతో మరణించిన ప్రతి ఒక్కరికీ పరిహారం ఇవ్వాలంటే.. రాష్ట్రాల ఖజానాకు మించిన భారమవుతుందని పేర్కొంది.

బాధితుల బీమా చెల్లింపులకు సంబంధించి జిల్లా కలెక్టర్లు దరఖాస్తులను ఇన్సూరెన్స్ సంస్థలకు పంపించారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే బీమా సంస్థలకు రూ.442.4 కోట్ల నిధులను విడుదల చేశామంది. 2019–2020లోనే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.1,113.2 కోట్ల అదనపు నిధులను విడుదల చేశామని వివరించింది. మొత్తంగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్స్ ప్రిపేర్డ్ నెస్ ప్యాకేజ్ కింద ఇప్పటిదాకా రూ.8,257.89 కోట్ల నిధులను ఇచ్చామని కేంద్రం వెల్లడించింది.

- Advertisement -