రాజకీయ దురుద్దేశంతోనే ఉత్తర్వులు :మంత్రి జగదీశ్‌

36
jagadish
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్తు బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్తు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్త‌ర్వుల‌పై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు రాజకీయ దురుద్దేశంతో ఇచ్చినవని, పూర్తి అసంబ‌ద్ద‌మైన ఉత్త‌ర్వులు అని అన్నారు. తెలంగాణ వాదనలు వినకుండా ఆంధ్ర వాదనలు విని కేంద్ర ఏకపక్ష ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కేంద్రం జారీ చేసిన‌ విద్యుత్ ఉత్తర్వులపై న్యాయపోరాటం చేస్తామ‌ని పేర్కొన్నారు.

తెలంగాణ‌ రాష్ట్రంలో విద్యుత్ కోతలు రావాలని కేంద్రం కుట్రలు చేస్తుందని ధ్వ‌జ‌మెత్తారు. కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా కేంద్ర ఉత్తర్వులు ఉన్నాయని మంత్రి తెలిపారు. విద్యుత్ రంగంలో బీజేపీ సాధించలేని విజయాన్ని తెలంగాణా సాధించిందని అక్కసు వెళ్ల‌గ‌క్కుతుంద‌న్నారు. సంవత్సర కాలంగా తెలంగాణ విద్యుత్ సంస్థలను ఇబ్బందులకు గురి చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అందుబాటులో ఉన్న వనరులతో దేశం మొత్తం రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చని కేసీఆర్ చెప్పడం బీజేపీకి రుచించడం లేద‌ని జ‌గ‌దీశ్ రెడ్డి అన్నారు.

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని కేసీఆర్ దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ‌కు రూ. 12,941 కోట్లు రావాలని చెబుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. బీజేపీ వైఫల్యాలపై కేసీఆర్ ప్రశ్నిస్తునందునే తెలంగాణ రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్లు విఫలమైన సందర్భంలో నూతన రాష్ట్రం తెలంగాణ విజయపథంలో దూసుకెళ్తుండటంతో దుర్భుద్ధితో కుట్రలు చేస్తున్నార‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు

 

- Advertisement -