Bhumana:టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ

26
- Advertisement -

టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అధ్యక్ష‌త‌న మంగ‌ళ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన భూమన.. ఈనెల 23, 24వ తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం వచ్చిన వేలాది మంది సామాన్య భక్తులు, విఐపిలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కటి ఏర్పాట్లు చేసిన ఈవోకి, వారి బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందుకు సహకరించిన బోర్డు సభ్యులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నానన్నారు.

ముఖ్య‌మంత్రివ‌ర్యులు వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల పంపిణీ వివిధ దశల్లో చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి మొదటి దఫా డిసెంబరు 28న 3,518 మందికి ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తాం. రెండో దఫా జనవరి మొదటి వారంలో 1500 మందికి ఇళ్లస్థలాల పంపిణీ చేప‌డ‌తాం. మూడో దఫాలో ఏర్పేడు స‌మీపంలోని పాగాలి వ‌ద్ద 350 ఎకరాల భూమి కొరకు కలెక్టరును కోరడం జరిగింది. దీని వలన 5 వేల మందికి లబ్ధి చేకూరుతుంది. వీరికి కూడా ఫిబ్రవరిలో ఇళ్లస్థలాల పంపిణీకి చర్యలు తీసుకుంటాం. దీంతో విశ్రాంత ఉద్యోగులకు, ఉద్యోగులంద‌రికీ ఇళ్ల‌స్థ‌లాలు అందించిన‌ట్టు అవుతుంది. ఈ ఇళ్ల‌స్థ‌లాల‌ను ప్ర‌భుత్వం నుండి టీటీడీ కొనుగోలు చేసి అభివృద్ధి చేసి ఉద్యోగుల‌కు అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఉద్యోగులు తిరిగి టీటీడీకి చెల్లిస్తారున్నారు.

సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా ఫిబ్రవరి నెలలో తిరుమలలో పీఠాధిపతులు, మఠాధిపతుల సదస్సు నిర్వహించాలని నిర్ణయించాం. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులను సదస్సుకు ఆహ్వానిస్తాం అని… శ్రీ‌వారి పోటు కార్మికుల‌కు రూ.10 వేలు వేత‌నం పెంచాల‌ని నిర్ణ‌యం. అదేవిధంగా ఎంతో క‌ష్టంతో కూడిన విధులు నిర్వ‌హిస్తున్న వాహ‌న‌బేర‌ర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ కేట‌గిరీగా గుర్తించి త‌గిన వేత‌నం పెంపున‌కు నిర్ణ‌యం తీసుకుంటామన్నారు.

వంద‌ల సంవ‌త్స‌రాలుగా శ్రీ‌వారి ఆల‌య అర్చ‌క కైంక‌ర్యాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న శ్రీ పెద్ద‌జీయ‌ర్ మ‌ఠానికి రూ.60 ల‌క్ష‌లు, శ్రీ చిన్న‌జీయ‌ర్ మ‌ఠానికి రూ.40 ల‌క్ష‌లు ఆర్థిక స‌హ‌కారం పెంపున‌కు నిర్ణ‌యం తీసుకున్నామన్నారు. టీటీడీలోని పలు విభాగాల్లో వర్క్‌ కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న కార్మికులకు వేతనాలు పెంచడం జరిగింది. స్కిల్డ్‌ కార్మికులకు రూ.15 వేల నుండి రూ.18,500/-కు, సెమిస్కిల్డ్‌ కార్మికులకు రూ.12 వేల నుండి రూ.15 వేలకు, అన్‌స్కిల్డ్‌ కార్మికులకు రూ.10,340 నుండి రూ.15 వేలకు పెంచ‌డం జ‌రిగిందన్నారు భూమన.

జిఓనం. 110, తేదీ : 13-03-2023 ప్రకారం కల్యాణకట్టలో విధులు నిర్వహిస్తున్న పీస్‌రేట్‌ క్షురకులకు నెలకు రూ.20 వేలు కనీస వేతనం చెల్లించేందుకు ఆమోదం తెలిపామని..రూ.14.47 కోట్లతో తిరుమలలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డులో గోగర్భం డ్యామ్‌ సర్కిల్ వ‌రకు శాశ్వత క్యూలైన్ల నిర్మాణానికి టెండరు ఖరారుకు ఆమోదం చెప్పామన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సత్రం(రెండో సత్రం) స్థానంలో జిఎస్టీ కాకుండా రూ.209.65 కోట్లతో అచ్యుతం వసతి సముదాయం, శ్రీకోదండరామస్వామి సత్రం(మూడో సత్రం) స్థానంలో జిఎస్టీ కాకుండా రూ.209.65 కోట్లతో శ్రీపథం వసతి సముదాయం నిర్మాణానికి టెండర్లు ఆమోదం చెప్పామని.. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో పాలనా సౌలభ్యం కోసం రూ.6.15 కోట్లతో సెంట్రలైజ్డ్‌ రికార్డు స్టోర్‌ నిర్మాణానికి టెండరు ఆమోదం తెలిపామన్నారు.

దూరప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు తమ బస్సులు, ఇతర వాహనాలను అలిపిరిలో పార్క్‌ చేసి తిరుమలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ రూ.7.31 కోట్లతో వంటషెడ్లు, మరుగుదొడ్ల బ్లాక్‌లు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి, శాశ్వత క్యూలైన్ల ఏర్పాటుకు టెండరు ఖరారుకు ఆమోదం తెలిపామన్నారు.

అదేవిధంగా, అలిపిరిలో రూ.7.24 కోట్లతో నూతన పార్కింగ్‌ ప్రాంతాల ఏర్పాటుకు టెండరు ఖరారు చేశామని…వీటితోపాటు రూ.1.94 కోట్లతో అలిపిరి బస్టాండు, పార్కింగ్‌ ప్రాంతంలో బిటి రెన్యువల్‌ రోడ్డు ఏర్పాటుకు టెండరు ఆమోదం చెప్పామన్నారు. తిరుమల హెచ్‌విసి ప్రాంతంలో మిగిలి ఉన్న కాటేజీల్లో రూ.1.82 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పనులు, మరమ్మతులు చేపట్టేందుకు టెండరు ఆమోదం చెప్పామని.. శ్రీనివాసం విశ్రాంతి సముదాయంలో బస చేసే భక్తుల సౌకర్యం కోసం శ్రీనివాసం తూర్పువైపున రూ.2 కోట్లతో ఓపెన్‌ డ్రెయిన్‌ నిర్మాణానికి టెండరు ఆమోదం తెలిపామన్నారు. తిరుమలలో యాత్రికుల కాటేజీల్లో నివాసమున్న పోలీసు సిబ్బందిని ఖాళీ చేయించే నిమిత్తం పాత పోలీసు క్వార్టర్ట్స్‌ను రూ.2.87 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు టెండరు ఖరారుకు ఆమోదంతో పాటు ప్రస్తుతం వరాహస్వామి విశ్రాంతి గృహం వద్ద అధిక ట్రాఫిక్‌ దృష్ట్యా భక్తులకు ఇబ్బంది లేకుండా వాహనాల రద్దీని పూర్తిగా మళ్లించేందుకు రూ.6.32 కోట్లతో వరాహస్వామి విశ్రాంతి గృహం నుండి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డు ఏర్పాటుకు టెండర్ల ఆమోదం చెప్పామన్నారు.

Also Read:తమలపాకు తింటే ఎన్ని ఉపయోగాలో..!

- Advertisement -