చప్పట్లు కొట్టుడు కాదు పని చేయాలే- సీఎం కేసీఆర్‌

173
- Advertisement -

సీఎం కేసీఆర్ మంగళవారం తాను దత్తత తీసుకున్న గ్రామం వాసాలమర్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో వేలమంది ప్రజలకు ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో ఆయన కూడా సహపంక్తి భోజనం చేశారు. తమతో కలిసి సీఎం కేసీఆర్ భోజనం చేయడం వాసాలమర్రి గ్రామస్తులను ఆనందంలో ముంచెత్తింది. ఈ భారీ భోజన కార్యక్రమం అనంతరం సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించారు. ప్రసంగం ఆరంభంలోనే తన మార్కు ప్రదర్శించారు. ‘వాసాలమర్రి గ్రామ అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు అందరికీ నా నమస్కారం’ అంటూ పేర్కొన్నారు. దాంతో సభకు విచ్చేసిన వారు కరతాళ ధ్వనులు చేయగా, ‘చప్పట్లు కొట్టుడు కాదు, పనిచేయాలే’ అంటూ తన వైఖరి స్పష్టం చేశారు.

“ఇంతకు ముందు ఒకయాన సీటీ (ఈల) కొడుతుండు. సీటీ కొట్టేందుకు నేనేమైనా సినిమా యాక్టర్నా? సీటీలు, వట్టి లొల్లి బంద్ చేద్దాం. రేపటినుంచి సర్పంచ్ అంజయ్య, ఎంపీటీసీ నవీన్ ల నాయకత్వంలో అద్భుతమైన పని జరగాలె. భోజనం సమయంలో ఇద్దరు ఆడబిడ్డలు నా పక్కనే కూర్చున్నారు. భోజన సమయంలో అల్ల నేరేడు పళ్లు కూడా పెట్టారు. ఊర్లో అల్ల నేరేడు చెట్లు ఉన్నాయా అమ్మా? అంటే ‘లేవు బిడ్డా’ అని వారిలో పెద్దావిడ చెప్పింది. ఊరంటే ఇదా?… ఊర్లో అల్ల నేరేడు చెట్టు కూడా లేకపోవడంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలాంటివి సాధారణంగా తీసుకోకూడదు. ఏదైనా ప్రత్యేకమైన పని కచ్చితంగా జరగాలి. ఊరు సమగ్రాభివృద్ధి జరగాలి.

ఈ ఊరికి ఇంకా 20 సార్లు వస్తాను. ఈసారి ఇలాంటి సభలు జరగవు. ఏడాది తర్వాత వాసాలమర్రి… బి వాసాలమర్రి కావాలి. బి అంటే బంగారు వాసాలమర్రి అని అర్థం. వీటన్నింటికంటే ముందు ప్రేమ భావం ఎంతో ముఖ్యం. ఊర్లో వివాదాలు ఉండొద్దు. సమస్యలు పరిష్కరించి కేసులు పరిష్కరించాలని పోలీసు అధికారులకు కూడా చెబుతా. పొరుగింటి వాళ్ల అభివృద్ధిని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. అలాంటప్పుడు బంగారు వాసాలమర్రి సాకారం కాదా?

సీఎం అంతటివాడే మీ వాడైనప్పుడు అన్నీ మీ ఊరికి వస్తాయి. ప్రతి ఒక్కరికీ గొర్రెనో, బర్రెనో, చాక్లెట్టో, ట్రాక్టరో ఇవ్వగలను. కానీ ఇప్పుడు కావాల్సింది మీ గ్రామస్తుల్లో ఐక్యత. ఒక పట్టుబట్టి అద్భుతం చేశారని చుట్టు పక్కల గ్రామాలన్నీ మీ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి” అని కర్తవ్య బోధ చేశారు. కాగా, తన ప్రసంగం సాగుతున్న సమయంలో వేదికపై ఓ మూల ఉన్న గ్రామ సర్పంచి అంజయ్య, ఎంపీటీసీ నవీన్ లను గుర్తించిన సీఎం కేసీఆర్… వెంటనే వారికి వేదికపై తన సమీపంలో కుర్చీలు వేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి ఓ కమిటీ అవసరమని, పార్టీలకు అతీతంగా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు.

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని 421 గ్రామాల అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. వాసాల‌మ‌ర్రి పుణ్య‌మా అని జిల్లాలోని గ్రామాలు అభివృద్ధి అవుతున్నాయి. ముఖ్య‌మంత్రి నిధి నుంచి ప్ర‌తి గ్రామ పంచాయ‌తీకి రూ. 25 ల‌క్ష‌ల చొప్పున మంజూరు చేస్తున్నాను. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల‌కు కూడా నిధులు మంజూరు చేస్తాను. భువ‌న‌గిరి మున్సిపాలిటికీ రూ. కోటి, మిగ‌తా ఐదు మున్సిపాలిటీల‌కు రూ. 50 ల‌క్ష‌ల చొప్పున మంజూరు చేస్తున్న‌ట్లు సీఎం ప్ర‌క‌టించారు.

త్వ‌ర‌లో గ్రామ అభివృద్ధి క‌మిటీలు ఏర్పాటు చేయాలి. అధికారులు వ‌చ్చి ప్ర‌తి ఇంటి ప‌రిస్థితిని అధ్య‌య‌నం చేయాలి. వాసాల‌మ‌ర్రికి కూడా వంద గ్రామాల ప్ర‌జ‌లు వ‌చ్చి అభివృద్ధి నేర్చుకోని పోవాల‌న్నారు. ఈ గంట నుంచి కులం లేదు, మ‌తం లేదు, జాతి లేదు. మ‌నంద‌రిది ఒకటే కులం. మ‌న‌ది అభివృద్ధి కులం, బాగుప‌డే కులం అని సీఎం పేర్కొన్నారు. ఇలా ముందుకుపోతే త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -