రైల్వే ప్రైవేటు పరంతో ప్రజలకు ఇక్కట్లు- వినోద్

149
vinod
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైల్వేను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారని, దీంతో ప్రజలు ఇక్కట్లకు గురవుతారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఏర్పాటైన తెలంగాణ రైల్వే ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ( టీ.ఆర్.ఈ.జే.ఏ.సీ ) సోమవారం సికింద్రాబాద్ లో నిర్వహించిన సభలో వినోద్ కుమార్ మాట్లాడారు.

ప్రధాని మోడీ చర్యల వల్ల లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకుండా పోతుందని, లక్షల కోట్ల రూపాయల విలువైన రైల్వే స్థిర, చరాస్థులు ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్లనున్నాయని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.లాభాల బాటలో నడుస్తున్న రైల్వే సంస్థను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రధాని మోడీ రంగం సిద్ధం చేసుకున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు.మూడేళ్ళుగా పార్లమెంట్ లో రైల్వే బడ్జెట్ ను ప్రవేశ పెట్టకుండా, జనరల్ బడ్జెట్ లో కలిపేసి ప్రైవేటీకరణకు ముందుగానే పథకాన్ని రచించారని వినోద్ కుమార్ అన్నారు.

అమెరికా, కెనెడా సహా అనేక దేశాల్లో ఇప్పటికీ రైల్వే వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్న ఆయన గుర్తు చేశారు. అర్జెంటీనా సహా పలు దేశాల్లో రైల్వే సంస్థలను ప్రైవేటు పరం చేయడం వల్ల ఎదురైన చేదు అనుభవాలను వినోద్ కుమార్ వివరించారు. అర్జెంటీనాలో ప్రభుత్వ నిర్వహణలో రైల్వే వ్యవస్థ ఉండగా 47 వేల కిలో మీటర్లు ఉన్న రూటు ప్రైవేటు చేతికి వెళ్లిన తర్వాత అది కాస్తా 8 వేళా కిలోమీటర్లకు పడిపోయిందని, 95 వేల ఉద్యోగులు ఉన్న అర్జెంటీనా ప్రభుత్వ రైల్వే ప్రైవేటు అయ్యాక 15 వేల ఉద్యోగులకు చేరిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

రైల్వే ప్రైవేటు పరం కావడం వల్ల టికెట్ల ధరలు పెరుగుతాయని, ఆస్తులు అన్యాక్రాంతం అవుతాయని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ కుట్రలను ఐక్య పోరాటాలతో తిప్పి కొట్టాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సభలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, రైల్వే ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు యాదవరెడ్డి, రవీందర్, బుచ్చిరెడ్డి, యుగంధర్, శ్రీధర్, టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, ఇంచార్జీ ఎల్. రూప్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -