ఏపీలో తటస్థ ఓటు బ్యాంకు ఎటువైపు?

9
- Advertisement -

ఏపీలో ఎన్నికలు దగ్గర పడడంతో ఈ సారి అధికారంలోకి వచ్చే పార్టీ ఏదనేది హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి అధికారం కోసం ఉవ్విళ్లూరుతోంది. అటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కూడా ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఎంత మైలేజ్ ఉంది ? అధికారంలోకి వచ్చే సత్తా ఏ పార్టీకి ఉంది ? ఇంతకీ ఓటర్ నాడీ ఎలా ఉంది ? అనే ప్రశ్నలు పోలిటికల్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సంక్షేమమే ప్రధాన ఎజెండాగా సాగిన తమ పాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని అందుకే మరోసారి తమదే అధికారమని వైసీపీ ధీమాగా ఉంది. అయితే జగన్ పాలనపై నెలకొన్న అసంతృప్తి తమకు అనుకూలంగా మారుతుందని, ఈసారి కూటమి అధికారంలోకి రావడం ఖాయంని టీడీపీ అండ్ కొ చెబుతోంది.

అయితే ఏ పార్టీ గెలుపోటములైనా ఆ పార్టీకి లభించే ఓటు షేర్ పై ఆధార పడి ఉంటుంది. అందువల్ల నియోజక వర్గాలవారీగా చూస్తే ఓటు షేర్ కీలకంగా మారితే, రాష్ట్ర ష్టాయిలో చూస్తే సీటు షేర్ కీలకమౌతుంది. అయితే ప్రతి పార్టీకి నియోజక వర్గాల వారీగా స్థిరమైన ఓటు బ్యాంకు ఉండడం సహజం. ఈ రకమైన ఓట్లలో ఎన్నికల్లో ఎలాంటి మార్పు ఉండదు. అలాంటి టైమ్ లో న్యూట్రల్ ఓటు బ్యాంకు పార్టీ యొక్క గెలుపోటములను డిసైడ్ చేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ 10.7 శాతం అధిక ఓటు షేర్ తో టీడీపీ పై పైచేయి సాధించింది.

ఫలితంగా టీడీపీ బలంగా ఉన్న చోట్ల కూడా విజయం సాధించి కాని విని ఎరుగని రీతిలో 151 సీట్లను సొంతం చేసుకుంది. వైసీపీకి ఆ స్థాయి విజయం దక్కడం వెనుక తటస్థ ఓటు బ్యాంకు కీ రోల్ పోషించిందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ఇక ఈసారి ఎన్నికల్లో ఈ తటస్థ ఓటు బ్యాంకు ఎటు వైపు మళ్ళితే ఆ పార్టీకీ విజయం లభించే అవకాశం ఉంది. మరి ఇప్పటివరకు బయటకు వస్తున్న సర్వేలు, విశ్లేషణలు కూడా న్యూట్రల్ ఓటు బ్యాంకు ఎటువైపు అనే విషయాన్ని స్పష్టంగా అంచనా వేయలేకపోవడంతో ఈసారి విజయం సాధించే పార్టీ ఏదనేది ఎవరికి అంతుచిక్కడం లేదు. మరి ఈ న్యూట్రల్ ఓటు బ్యాంకు ఎన్నికల్లో ఎటువైపు మల్లుతుందో చూడాలి.

Also Read:రాజ్యాంగం ఎలా ఏర్పడిందో తెలుసా?

- Advertisement -