Revanth Reddy:రేవంత్ రెడ్డిపై గుస్సా!

11
- Advertisement -

లోక్ సభ ఎన్నికల వేళ టి కాంగ్రెస్ లో ముసలం ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సీట్ల కేటాయింపులో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా పార్టీలోని చాలా మంది నేతలు అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 13 స్థానాలకు గాను సీట్ల ప్రకటన జరగగా మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేయాల్సి ఉంది. అయితే సీట్ల కేటాయింపులో అధిక శాతం బయటి నుంచి వచ్చిన వారికే ప్రదాన్యత ఇస్తున్నారని సి‌ఎం రేవంత్ రెడ్డి పై ఇతర నేతలు గుర్రుగా ఉన్నారట. ఇప్పటివరకు కేటాయించిన సీట్లలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే పెద్దపీఠ వేశారు. దాంతో బీసీ నేతలు అసహనానికి లోనవుతున్నారట. సీట్ల కేటాయింపులో రేవంత్ రెడ్డి పాత్ర చాలానే ఉంది. .

సి‌ఎంగా ఉండడంతో పాటు టీపీసీసీ చీఫ్ గా కూడా ఆయనే ఉండడంతో రేవంత్ రెడ్డి సూచించిన వారికే అధిష్టానం టికెట్లు కేటాయిస్తూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా సీట్ల సర్దుబాటులో రేవంత్ రెడ్డి ముఖ్య పాత్ర వహించారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆయనే కీలకమయ్యారు. సీట్ల కేటాయింపు కోసం ఇప్పటికే పలు మార్లు డిల్లీలో పార్టీ పెద్దలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి మరోసారి పార్టీ పెద్దలతో భేటీ అయి ఫైనల్ లిస్ట్ రెడీ చేసే అవకాశం ఉంది. అయితే ఇటీవల కాంగ్రెస్ లో చేరికలు పెరుగుతున్న వేళ పార్టీలోని పాత నేతలను పక్కన పెట్టి కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవల బి‌ఆర్‌ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి ఆయన కూతురి కోసం వరంగల్ (ఎస్సీ ) టికెట్ కోరుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా అందుకు సుముఖంగానే ఉన్నట్లు వినికిడి. ఇలా కొత్తగా చేరుతున్న వారికే అధిక ప్రదాన్యత ఇస్తుండడంతో రేవంత్ రెడ్డి వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు కొంతమంది నేతలు రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎన్నికల ముందు ఈ అసమ్మతి మరింత పెరిగితే పార్టీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఈ అనిశ్చితిని రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Also Read:భానుడి భగభగ..మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

- Advertisement -