సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రెండున్నరేళ్ల తర్వాత స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగు మాడవీధుల్లో నిర్వహిస్తుండటంతో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలని సూచించారు. టీటీడీ సూచించింది. తిరుమల, అలిపిరిలో భక్తుల కోసం తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు.
సెప్టెంబర్ 27న సాయంత్రం సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారని… బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబర్ 1న గరుడ సేవ, 2న స్వర్ణ రథం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం ఉంటుందన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేస్తామన్నారు. ఆర్జిత సేవలు, శ్రీవాణి, విఐపీ బ్రేక్ దర్శనాలు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేశామని తెలిపారు.