ప్రజాపంపిణీలో అద్భుత ప్రగతి: అకున్ సబర్వాల్

463
- Advertisement -

సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజా పంపిణీలో అద్భుత ప్రగతి సాధించామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. మెరుగైన సేవల కోసం మొబైల్‌ యాప్స్ తీసుకొచ్చామని చెప్పారు. జాతీయ స్థాయి ఆహార కార్యదర్శుల సదస్సులో పాల్గొన్న సబర్వాల్ …సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలో అద్భుత ప్రగతిని సాధించిందని అన్నారు.

కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 3.51 కోట్ల మంది జనాభా ఉందని, ఇందులో 87.72 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయని, దీని ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధిపోందుతున్నారని, కుటుంబంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కిలో రూపాయికే ఆరు కిలోల బియ్యం అందిస్తున్నామని తెలిపారు.

రేషన్‌ లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునేందుకు వీలుగా 2018 మేలో రాష్ట్రంలో రేషన్‌ పోర్టబిలిటీ ప్రారంభించడం జరిగిందని, ప్రతి నెల దాదాపు 13 లక్షల మంది పోర్టబిలిటీని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ధాన్య సేకరణ, ప్రజాపంపిణీ వ్యవస్థ పకడ్బందీగా చేపట్టడం కోసం మొబైల్‌ యాప్‌ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.

ఓపీఎంఎస్‌, కొనుగోలు కేంద్రాల జియో ట్యాగింగ్‌, రైస్‌ మిల్లర్ల లావాదేవీలకు సంబంధించి అక్నాలెడ్జ్‌మెంట్‌ ఆప్‌, టీ రేషన్‌ ఆప్‌, టీ వాలెట్‌ ఆప్‌ వంటి సదుపాయాలు ఈ మొబైల్‌ యాప్స్‌లో ఉన్నాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పౌరసరఫరాల శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలో వినూత్న మార్పులు చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోందని సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ఆహార మరియు పౌరసరఫరాల కార్యదర్శులు ప్రశంసించారు.

‘ప్రజాపంపిణీలో సంస్కరణలు మరియు వినూత్న చర్యలు’ అంశంపై రెండు రోజుల పాటు గుజరాత్‌లో జరుగుతున్న జాతీయ స్థాయి సదస్సులో ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆహార కార్యదర్శులు పాల్గొన్నారు. మొదటిరోజు సదస్సులో తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ ప్రజాపంపిణీ వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన విజయాలను వివరించారు.

akun sabarwal

- Advertisement -