‘మా’లో సభ్యత్వం ఉన్నవారు ఎవరైనా పోటీ చేయొచ్చు..

94
- Advertisement -

టాలీవుడ్‌లో గతంలో ఎన్నడూ లేనంత చర్చనీయాంశమయ్యాయి మా ఎన్నికలు. సినీ పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయి ఎన్నికలకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ప్రకాశ్‌ రాజ్ వర్సెస్ మంచు విష్ణు ప్యానెల్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలపై నటుడు, నిర్మాత మురళీమోహన్ తాజాగా స్పందించారు.

మురళీమోహన్ మాట్లాడుతూ.. మా అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఇద్దరూ సమర్థులేనన్నది తన అభిప్రాయమని పేర్కొన్నారు. మా ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని భావించినా సాధ్యం కాలేదని తెలిపారు. ఎవరు గెలిచినా సరే మా భవన నిర్మాణంతో పాటు సభ్యుల బాగోగుల కోసం శ్రమించాలని సూచించారు. ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ అనే వాదన తీసుకువరావడం విచారకరమని, ఆ విధమైన తేడా ఇండస్ట్రీలో లేదని పేర్కొన్నారు.

కళామతల్లి లోకల్, నాన్ లోకల్ అని చూడదని, అందరూ సమానమేనని అన్నారు. మాలో సభ్యత్వం ఉన్నవారు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చని స్పష్టం చేశారు. లోకల్, నాన్ లోకల్ భేదాలు పోవాలంటే పెద్ద హీరోలు చొరవ తీసుకుని ఇలాంటి విభేదాలను తొలగించే ప్రయత్నం చేయాలని మురళీమోహన్ పిలుపునిచ్చారు.

- Advertisement -