ఏసీబీ వలలో కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య

15
- Advertisement -

రాష్ట్రంలో రెండవ అతిపెద్ద యూనివర్సిటీ గా పేరుగాంచిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పలు ఆఫీస్ లలో ఒక్కడే అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్. కిష్టయ్య రూ.యాభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబట్టాడు. వర్సిటీలోనీ వివిధ మెస్ లలో పాలు సరఫరా చేస్తున్న వ్యాపారి నుండి పాల బిల్లులను పాస్ చేయడానికి సదరు వ్యాపారి దగ్గరి నుండి గతంలో చిన్న మొత్తంలో లంచం తీసుకొనగా, ప్రతి సారి బిల్లు పాస్ చేయడానికి బిల్లుకు 5 శాతం లంచం అడుగుతూ వేధిస్తున్న ఏ.అర్ కిష్టయ్య పై పాల వ్యాపారి ఏసీబీ కి ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదును స్వీకరించిన హన్మకొండ ఏసీబీ అధికారులు పథకం వేసి ఏ.ఆర్ కిష్టయ్య ను పాల వ్యాపారి దగ్గరి నుండి రూ.యాభై వేలు లంచం తీసుకుంటుండగా వర్సిటీలోని తన ఆడిట్ ఆఫీస్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో రూ. 10 వేలు ఫోన్ పే ద్వారా కిష్టయ్య తన దగ్గర నుండి వసూలు చేశారని, మిగిలిన బిల్లులను పాస్ చేయడానికి రూ.యాభై వేలు డిమాండ్ చేస్తూ పలు సార్లు ఫోన్ లో మాట్లాడాడని, లంచం ఇవ్వకుంటే హాస్టల్ లో ఈ మధ్య జరిగిన రెండు కోట్ల కుంభకోణం కారణంగా విచారణ కమిటీ పడితే ఆ తర్వాత నీ బిల్లులు పాస్ కావని పలుమార్లు బెదిరించారని ఏసీబీ కి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ప్రతి నెల హాస్టల్ ఆఫీస్ లో రూ.యాభై లక్షల లావా దేవీలు జరుగుతాయని సమాచారం. ఐదు శాతం అంటే నెలకు రూ.2,50,000/-. కిరాణా, చికెన్, బియ్యం, కట్టెలు సరఫరా చేసేవారి వద్ద నుండి లంచం తీసుకుంటున్నట్టు సమాచారం. గత సంవత్సరం హాస్టల్ డైరెక్టర్ డా మంజుల, సూపరింటండెంట్ వీరు నాయక్ లు కలిసి రూ.రెండున్నర కోట్ల కుంభకోణం చేశారని హాస్టల్ నిర్వహణ కమిటీ తేల్చి వారిని మందలించిన విషయం మరువక ముందే లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏ.ఆర్ కిష్టయ్య సంఘటన వర్సిటీలో మరోసారి సంచలనం సృష్టించింది. ఇంత పెద్ద మొత్తంలో లంచాలు ఒక్కడికే చెందవని దీంట్లో పెద్ద తిమింగలాల చేతి వాటం వుంటుందని పలువురు భావిస్తున్నారు. వీసీ ప్రో.తాటికొండ రమేష్, ఏ.ఆర్ కిష్టయ్య ను కావాలనే ఆర్ట్స్ కాలేజీ నుండి క్యాంపస్ కు బదిలీ చేయించి కీలక మయిన విభాగాల్లో ఎస్. కిష్టయ్యను ఒక్కడినే అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా నియమించుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని తదుపరి విచారణలో విషయాలన్నీ బయట పడి అవకాశం వుందని అంటున్నారు.

ఒక్కడినే నాలుగు కీలకమయిన కార్యాలయాల్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా నియమించి బిల్లులు పాస్ చేయించుకోవడానికి తన పనిని సులభతరం చేసుకునేందుకే వీసీ రమేష్ పన్నాగం పన్నినట్లు తెలుస్తుంది. ఇటీవల న్యాక్ గ్రేడ్ కొరకు వర్సిటీల్లో అనేక రకాల నిర్మాణాలు చేపట్టారు. వీటి కొరకు దాదాపు రూ.10 కోట్లు కేటాయించారు. వీటిలో 8 కోట్లతో కే – హబ్ నిర్మాణం చేపట్టగా మిగిలిన వాటితో రోడ్లు, హాస్టల్ మరియు ఇతర భవనాల మరమ్మత్తులు చేపట్టారు. కే – హబ్ యొక్క నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణ సంస్థ చేపట్టగా మిగిలిన నిర్మాణ పనులు లోకల్ గా వున్న ప్రైవేటు వ్యక్తులకు ఆర్డర్లు ఇచ్చి చేయించారు. ఈ పనులకు సంబంధించిన దొంగ బిల్లులు తయారు చేయడానికి కిష్టయ్య ను బిల్డింగ్ డివిజన్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా వీసీ రమేష్ నియమించారు. బిల్డింగ్ డివిజన్ లో తయారయిన బిల్లులు పాస్ కావడానికి వర్సిటీ పాలనా భవనంలో వుండే ఆడిట్ ఆఫీస్ కు రావాలి. ఈ ఆడిట్ ఆఫీస్ లో కూడా కిష్టయ్య నే ఏ.ఆర్ గా ఉంచడంతో బిల్లులు చాలా సులభంగా పాస్ చేసి కమీషన్లు తీసుకున్నారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏ.సీ.బీ విచారణలో బయట పడే అవకాశాలు వున్నాయి. కిష్టయ్య వెనుక వున్న తిమింగలం కూడా ఈ సందర్భంగా బయట పడతుందని వర్సిటీల్లో చర్చ జరుగుతుంది.

Also Read:బాలయ్యతో రాజశేఖర్ కామెడీ

సర్వే నెంబరు 229 లోని కేయూ భూమిని కబ్జా చేసి ఇండ్లు కట్టుకున్న మరో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెండ్లి అశోక్ బాబు ను వీసీ తన కుడి భుజంగా పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల అకుట్ సంఘ బాధ్యులు ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కి ఫిర్యాదు కూడా చేశారు. తన అక్రమాలను సక్రమంగా చేసుకోవడానికి వీసీ ప్రో.తాటికొండ రమేష్ తనకు అనుకూలంగా వున్న వాళ్ళని కీలకమయిన శాఖల్లో పెట్టుకొని పాలన కొనసాగిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. గత రెండున్నరేళ్లలో అనేక అక్రమ నియామకాలు చేసి ప్రజా ధనం కొల్లగొడుతున్నారని వీసీ, రిజిస్ట్రార్ పై పలు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి బీ.ఆర్.ఎస్ ప్రభుత్వానికి అనుగుణంగా పత్రికల్లో వ్యాసాలు రాసి కండువా కప్పుకోకుండానే బీ.ఆర్.ఎస్ కార్యకర్తగా పని చేస్తూ, అదే ప్రభుత్వ సిఫార్సు తో ప్రొఫెసర్ గా పదేళ్ల అనుభవం లేకున్నా యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వీసీ గా నియామకం అయి నిరంకుశ పాలన కొనసాగిస్తూ ఇటువంటి వారిని బినామీలుగా పెట్టుకొని వర్సిటీ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు వీసీ రమేష్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఇటువంటి వీసీ లపై విచారణ కమిటీ నియమించి చర్యలు తీసుకోవాలని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు కోరుకుంటున్నాయి.

- Advertisement -