వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తులకు మరియు ఉత్సవ కమిటీలకు తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.ప్రజల పండుగలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాలను ఎక్కడా ఏ లోటూ లేకుండా మరింత వైభవంగా నిర్వహించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రతి ఏటా గణేష్ నవరాత్రుల సందర్భంగా ఊరూరా, వాడవాడలా వేల సంఖ్యలో వినాయక మండపాలను ఏర్పాటు చేస్తుంటారు. ఈ ఉత్సవాల నిర్వహణలో విద్యుత్ ఛార్జీలు కమిటీలకు ప్రధాన భారంగా మారేవి. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని అధికారిక గణేశ్ మండపాలకు విద్యుత్ ఉచితంగా లభించనుంది.
విద్యుత్ భారం తగ్గడంతో భక్తులు, నిర్వాహకులు మండపాలను విద్యుత్ దీపకాంతులతో మరింత శోభాయమానంగా అలంకరించుకునే అవకాశం లభించింది.సులభతర ప్రక్రియ: మండపాల నిర్వహణకు అవసరమైన అనుమతులు మరియు ఉచిత కరెంట్ కనెక్షన్ పొందే ప్రక్రియను సరళతరం చేయాలని సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఈ సందర్భంగా సకల విఘ్నాలను తొలగించే ఆ బొజ్జ గణపయ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Als Read:అసెంబ్లీ నుండి BRS ఎమ్మెల్యేల సస్పెన్షన్

