Delhi SIR:47.7 లక్షల ఓట్లు తొలగింపు

2
- Advertisement -

ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) సోమవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కింద ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించారు. జాతీయ రాజధానిలోని మొత్తం 1.45 కోట్ల ఓటర్లలో ఏకంగా 47.7 లక్షల మంది ఓటర్ల పేర్లను ఈ ముసాయిదా నుండి మినహాయించారు.

ఈ జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వారు సెప్టెంబర్ 30 వరకు ఫారమ్ 6 మరియు సంబంధిత ఆధారాలతో దరఖాస్తులు లేదా అభ్యంతరాలను సమర్పించవచ్చని సీఈవో తెలిపారు. నవంబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు వెల్లడించారు. అభ్యంతరాల పరిశీలన, నోటీసుల జారీ ప్రక్రియ అక్టోబర్ 29తో ముగుస్తుంది.

ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో అధికారులు ఢిల్లీలోని మొత్తం 1,45,10,299 మంది ఓటర్లలో దాదాపు 67.18 శాతం మంది ఫారమ్‌లను డిజిటైజ్ చేశారు. మిగిలిన 47.7 లక్షల మందిని “సేకరించలేనివి” (గైర్హాజరు, వేరే ప్రాంతానికి మారినవారు, మరణించినవారు, నకిలీ మరియు ఇతరులు – ASDDO) కేటగిరీ కింద వర్గీకరించి, ముసాయిదా జాబితా నుండి తొలగించారు.

ఢిల్లీ సీఈవో డేటా ప్రకారం, రోహిణి నియోజకవర్గంలో అత్యధికంగా 83.43 శాతం డిజిటైజేషన్ జరగ్గా, తుగ్లకాబాద్‌లో అత్యల్పంగా 52.15 శాతం నమోదైంది.ఒఖ్లా నియోజకవర్గంలో మొత్తం 3,62,813 ఫారమ్‌లలో 1,64,435 (45.32 శాతం) సేకరించలేనివిగా గుర్తించారు. చాందినీ చౌక్‌లో ఇది 38.98 శాతం, బల్లిమారన్‌లో 32.65 శాతం, ముస్తఫాబాద్‌లో 28.09 శాతం, బాబర్‌పూర్‌లో 27 శాతం, మటియా మహల్‌లో 24.50 శాతం మరియు సీలంపూర్‌లో 23.37 శాతంగా నమోదు కావడం గమనార్హం.

షాహీన్ బాగ్, జసోలా విహార్ వంటి ప్రాంతాల్లో ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, అసోం మరియు పశ్చిమ బెంగాల్ నుండి వచ్చిన వలస కుటుంబాల వివరాలను 2002 ఓటర్ల జాబితాతో అనుసంధానించడంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLO) ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు షాకూర్ బస్తీ (81.26%), రాజౌరీ గార్డెన్ (79.14%), మంగోల్‌పురి (78.76%), ఉత్తమ్ నగర్ (77.76%) నియోజకవర్గాల్లో అత్యధిక డిజిటైజేషన్ నమోదైంది. మైనారిటీ వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో సీలంపూర్ 76.63 శాతం, మటియా మహల్ 75.50 శాతం, బాబర్‌పూర్ 73 శాతం, ముస్తఫాబాద్ 71.91 శాతం, బల్లిమారన్ 67.35 శాతం మరియు చాందినీ చౌక్ 61.02 శాతం డిజిటైజేషన్ సాధించాయి.

Also Read:బొత్సపై కేఏ పాల్‌ సంచలనం

ఈ SIR ప్రక్రియ ద్వారా ఢిల్లీలో పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా పెరిగింది. మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 13,033 నుండి 14,947కి పెరగ్గా, పోలింగ్ కేంద్రాల ప్రాంగణాల సంఖ్య 2,696 నుండి 2,856కి పెరిగింది.

- Advertisement -