సీడ్ గణేశా..సంతోష్‌పై చిరు ప్రశంసలు

13
- Advertisement -

సీడ్ గణేశుడిని
పూజించండి
అటు పుణ్యం దక్కుతుంది
ఇటు ప్రకృతికి మేలు జరుగుతుంది
పూజలందుకొని..నిమజ్జనమయ్యాక
మీ ఇంట్లోనే మొక్కై ఆశీర్వదిస్తాడు
మెగాస్టార్ చిరంజీవి
సీడ్ గణేశా ప్రతిమలను
ఆవిష్కరించిన చిరంజీవి, మాజీ ఎంపీ సంతోష్
పచ్చదనం పెంపు కోసం
సంతోష్ దీక్ష పట్టారంటూ ప్రశంసలు

ప్రకృతి సంరక్షణ కోసం పచ్చదనం పెంపుకోసం ఈ సారి అందరూ సీడ్ గణేశుడిని పూజించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. మట్టి వినాయకులను పూజించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని చెప్పారు. సీడ్ గణేశుడిని పూజించి ఆ తర్వాత ఇంట్లోనే నిమజ్జనం చేయడం వల్ల.. వినాయకుడు మొక్కై ఎదిగి మనల్ని ఆశీర్వదిస్తాడని తెలిపారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపొందించిన సీడ్ గణేశా ప్రతిమలను చిరంజీవి ఆదివారం తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ ను ఓ యజ్ఞం లా భావించి ఇప్పటికే 20 కోట్ల మొక్కలు నాటేలా లక్షల మందిని ప్రోత్సహించిన సంతోష్ ..అభినందనీయుడని ఆయన దీక్షకు తమ వంతు తోడ్పాటు ఉంటుందని ప్రశంసించారు.

ఆశీస్సులతో పాటు ఆరోగ్యాన్ని అందించాలి
సీడ్ గణేశుడిని ఆరాధించడం ద్వారా అటు పుణ్యం..ఇటు పురుషార్థం(ప్రకృతిని కాపాడే బాధ్యత) దక్కుతుందని చిరంజీవి ఈ సందర్భంగా చెప్పారు. “వినాయక చవితి వచ్చిందంటే ఊరూవాడా వేడుకలే వేడుకలు. అయితే ఇటీవల పోటీ బాగా పెరిగిపోయి.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసే విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీళ్లు కలుషితమవుతున్నాయి. పండుగతో అందరికీ ఆరోగ్యం అందాలి.భగవంతుడి ఆశీస్సులందాలి. ఈ నేపథ్యంలోనే సోదర సమానుడైన సంతోష్.. ఈ సీడ్ గణేశాను అందుబాటులోకి తెచ్చారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ను దీక్షలా ముందుకు తీసుకెళ్తున్న సంతోష్.. వినాయకుడి పూజకు విత్తనంతో కలిసి ఉన్న ప్రతిమను అందిస్తున్నారు. పూజ ముగిసిన తర్వాత ఇంట్లోనే నిమజ్జనం చేస్తే.. దేవుడే మొక్కగా మారి ఆశీర్వదిస్తాడు. సీడ్ మొక్కగా మారడంతో.. మనం అటు వినాయకుడుని పూజించినట్లవుతుంది. ఇటు మొక్కలను నాటిన బాధ్యత పూర్తయినట్టు ఉంటుంది” అని చెప్పారు.

మొక్కలు నాటడం ఇప్పుడు చాలా అవసరం
“కాలుష్యం పెరిగిపోతున్న ఈ రోజుల్లో మొక్కలు నాటడం అనేది కేవలం ఒక ఛాయిస్ కాదు, అదొక అవసరం” అని సంతోష్ కుమార్ బలంగా నమ్ముతారు. మాజీ సీఎం కేసీఆర్ మానస పుత్రిక ‘హరితహారం’స్ఫూర్తితో 2018లో మొదలైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. “మూడు మొక్కలు నాటాలి, వాటిని మూడేళ్లు పెంచాలి, మరో ముగ్గురిని నామినేట్ చేయాలి” అనే ఫార్ములాతో సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఇప్పటివరకు ఈ ఛాలెంజ్ ద్వారా ఏకంగా 19.6 కోట్ల చెట్లను నాటడం విశేషం.పండుగను కేవలం ఒక వేడుకలా కాకుండా.. ఒక అర్థవంతమైన పర్యావరణ ఉద్యమంగా మార్చే ఈ ‘సీడ్ గణేషా’ను పౌరులు, హౌసింగ్ సొసైటీలు, ఆలయ కమిటీలు దత్తత తీసుకోవాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజ్ఞప్తి చేస్తోంది. మరెందుకు ఆలస్యం.. ఈ సారి మీ ఇంట్లోనూ ఎకో ఫ్రెండ్లీ గణేషాను ప్రతిష్ఠించి, పర్యావరణాన్ని కాపాడండి!

Also Read:రూ.150 కోట్లు దాటిన ఇరుముడి

దేవుడే..వృక్షమైతే..
ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసే విగ్రహాల వల్ల చెరువులు, నదులు తీవ్రంగా కలుషితం అవుతున్నాయి. వీటికి చెక్ పెడుతూ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆలోచనల నుంచి పుట్టిందే ఈ వినూత్న వినాయకుడు. పూర్తిగా సహజమైన మట్టి, కోకోపీట్ , కొబ్బరి పొడితో ఈ విగ్రహాలను తయారు చేస్తారు. వీటి లోపల వేప, చింత లాంటి దేశీయ వృక్షాల విత్తనాలను ఉంచుతారు.నవరాత్రుల పూజల తర్వాత భక్తులు ఈ విగ్రహాన్ని ఏదైనా కుండలో లేదా పెరట్లోని మట్టిలో ఉంచి నీళ్లు పోస్తే చాలు. విగ్రహం కరిగిపోయి.. అందులోని విత్తనాలు మొలకెత్తి పచ్చని మొక్కగా ఎదుగుతాయి. అంటే మన దేవుడు మన ఇంట్లోనే ఒక వృక్షంలా శాశ్వతంగా ఉండిపోతాడన్నమాట.

కరోనా కాలంలో మొదలై
ఈ ‘సీడ్ గణేషా’ ప్రయాణం 2020లో కోవిడ్ సంక్షోభ సమయంలో అప్పటి అటవీశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది.తొలినాళ్లలో ఏటా దాదాపు 1.5 లక్షల విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.2023లో కూకట్‌పల్లి నెక్సస్ మాల్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ ధృవన్ (పుష్ప ఫేమ్) చేతుల మీదుగా పిల్లల్లో అవేర్‌నెస్ తీసుకొచ్చారు.2025లో స్వర్ణగిరి టెంపుల్‌లో యాక్టర్ నారా రోహిత్ సమక్షంలో ఏకంగా 5 లక్షల విగ్రహాల పంపిణీ లక్ష్యంగా భారీ కార్యక్రమం జరిగింది.తాజాగా 2026 సీజన్‌ కోసం మెగాస్టార్ చిరంజీవి దీన్ని ఆవిష్కరించి మరింత మందికి చేరువ చేశారు.

- Advertisement -