విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగాటి నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబలి’ విడుదలకు సంబంధించి మైత్రీ మూవీ మేకర్స్ గురువారం అధికారిక ప్రకటన చేసింది. ఈ దసరా పండుగ కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. విజయ్ తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ సరికొత్త వారియర్ పోస్టర్ను విడుదల చేశారు.
అక్టోబర్ 16న ‘రణబలి’ థియేటర్లలోకి రానుండగా తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ సీక్వెల్ చిత్రం ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై టాలీవుడ్లోనూ భారీ అంచనాలున్నాయి.
వీటితో పాటు ధనుష్ నటిస్తున్న ‘ఓం’ చిత్రం కూడా అక్టోబర్ 16నే ప్లాన్ చేస్తుండటంతో ఈ దసరా పండుగ సీజన్ బాక్సాఫీస్ వద్ద అత్యంత ఉత్కంఠభరితంగా మారనుంది. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 19వ శతాబ్దంలో (1854-1878) బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా రాయలసీమ ప్రాంతంలో జరిగిన తిరుగుబాటు, కరువు నేపథ్యంతో ఈ కథ సాగుతుంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ‘ది మమ్మీ’ సిరీస్ ఫేమ్ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ చిత్రంలో సర్ థియోడర్ హెక్టార్ అనే శక్తివంతమైన ప్రతి నాయకుడి (విలన్) పాత్రలో నటిస్తున్నారు.
Also Read:MEA:నేపాల్లో గల్లంతైన భారతీయుల లిస్ట్
ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. వరుస ప్లాప్ల తర్వాత విజయ్ దేవరకొండకు ఈ దసరా చిత్రం ఎంతో కీలకంగా మారింది.

