రంగనాథ్‌కు మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు

1
- Advertisement -

అక్రమ నిర్మాణాల కూల్చివేత, చెరువుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌కు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం మరోసారి షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌లోని ‘సల్కం చెరువు’లో అక్రమంగా నిర్మించిన ఒవైసీ కాలేజీ కట్టడాలపై చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ హైకోర్టు, హైడ్రా కమిషనర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

బండ్లాగూడలోని సల్కం చెరువు పరిధిలో ఒవైసీ విద్యాసంస్థలను అక్రమంగా నిర్మించారని, ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చెరువు భూమిని ఆక్రమించి చేపట్టిన ఈ నిర్మాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని గతంలోనే న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినప్పటికీ, అధికారులు కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు వేయాలని పిటిషనర్ అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను కింది అధికారులకు నోటీసులు జారీ చేస్తూ వివరణ కోరింది.
ఎ.వి. రంగనాథ్ – హైడ్రా కమిషనర్

జయేష్ రంజన్ – పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి

Also Read:కాంగ్రెస్‌కు కేంద్రమంత్రి రిజిజు సవాల్

వీరితో పాటు రాష్ట్ర విద్య, రెవెన్యూ, నీటిపారుదల (ఇరిగేషన్) శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు. ఆక్రమణలపై స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదో వివరించాలని స్పష్టం చేస్తూ, ఈ కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ నెల 11వ తేదీకి వాయిదా వేశారు. ఈ విచారణ సందర్భంగా అధికారులు ఇచ్చే సమాధానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

- Advertisement -