కలలాగా అనిపిస్తోంది:సాక్షి చౌదరి

2
- Advertisement -

గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ 7 స్వర్ణాలతో సహా మొత్తం 10 పతకాలతో చారిత్రాత్మక ఘనత సాధించడం పట్ల భారత బాక్సర్, స్వర్ణ పతక విజేత సాక్షి చౌదరి స్పందిస్తూ ఇది ఒక కలలా అనిపిస్తోంది అని వ్యాఖ్యానించారు. మహిళల 51 కేజీల ఫైనల్‌లో సాక్షి అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, ఇంగ్లాండ్‌కు చెందిన రూబీ వైట్‌ను 5-0తో ఏకగ్రీవ నిర్ణయంతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. CWG 2026లో భారత బాక్సింగ్ విభాగం అగ్రస్థానంలో నిలిచి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. సాక్షితో పాటు ప్రపంచ ఛాంపియన్ జైస్మీన్ లంబోరియా, ప్రీతి పవార్ (54 కేజీలు), ప్రియా ఘంఘాస్ (60 కేజీలు), అరుంధతి చౌదరి (70 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు), అంకుష్ పంఘాల్ (80 కేజీలు) కూడా స్వర్ణ పతకాలు సాధించారు. లవ్లీనా బొర్గోహైన్, జాదుమణి సింగ్, నరేందర్ బెర్వాల్ వెండి పతకాలు గెలుచుకుని భారత బాక్సింగ్ ప్రచారాన్ని ఘనంగా ముగించారు.

కామన్వెల్త్ గేమ్స్ ఒకే ఎడిషన్‌లో బాక్సింగ్‌లో మరే దేశం కూడా ఇన్ని స్వర్ణ పతకాలను సాధించకపోవడం విశేషం. ఆగస్టు 4న ఢిల్లీలోని ఐజీఐ (IGI) విమానాశ్రయానికి చేరుకున్న బాక్సింగ్ బృందానికి, సాక్షి చౌదరికి ఘన స్వాగతం లభించింది. ఏఎన్‌ఐ (ANI)తో సాక్షి మాట్లాడుతూ ఇదంతా ఒక కలలాగా ఉంది. మీరందరూ మాకు స్వాగతం చెప్పడానికి రావడం చాలా సంతోషంగా ఉంది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇది భారత్‌కు అత్యుత్తమ ప్రదర్శన. మనకు 10 పతకాలు వచ్చాయి, అందులో 7 స్వర్ణాలు ఉన్నాయి. ఇది ఒక రికార్డు. ఇకపై ఆసియా గేమ్స్ రాబోతున్నాయి, వాటి కోసం సిద్ధమవుతాం అని పేర్కొంది.

ఇంగ్లాండ్ క్రీడాకారిణి రూబీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సాక్షి మొదటి నుండి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రత్యర్థి దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతూ పంచ్‌లతో విరుచుకుపడింది. మ్యాచ్ చివరి క్షణాల్లో రూబీ పుంజుకోవడానికి ప్రయత్నించినప్పటికీ సాక్షి ఏమాత్రం తడబడకుండా విజయాన్ని ఖాయం చేసుకుంది.

Also Read:అద్దంకి, సామాకు హరీశ్ లీగల్ నోటీసులు

ఈ విజయంతో సాక్షికి ఈ ఏడాది ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. కామన్వెల్త్ గేమ్స్ అర్హత కోసం తన వెయిట్ కేటగిరీని తగ్గించుకున్న ఆమె, నేషనల్ సెలక్షన్ ట్రయల్స్‌లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్‌ను ఓడించి సంచలనం సృష్టించింది.

- Advertisement -