హద్దులు మీరి అమాయక ప్రజలపై అక్రమాలకు పాల్పడిన ఎవరిపైనైనా చట్టం తగిన చర్యలు తీసుకుంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ తెలిపారు. అయితే దీనికి పూర్తిగా స్వతంత్రమైన, నిష్పాక్షికమైన మరియు పారదర్శకమైన విచారణ అత్యవసరమని చెప్పారు. జవాబుదారీతనం నిర్ణయించకపోతే అటువంటి విచారణకు అర్థం ఉండదని ఆయన పేర్కొన్నారు.
ఈ కేసు విచారణ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ… ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ జరగాలనే దానిపై ఎలాంటి సందేహం లేదన్నారు. విచారణ స్వతంత్రంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉండాలని దీనికి సంబంధించిన కమిటీని తర్వాత ప్రకటిస్తామని చెప్పారు.
జూలై 20న జరిగిన ‘పార్లమెంట్ మార్చ్’ సందర్భంగా నిరసనకారులపై పోలీసు చర్యకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీజేఐ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారిస్తోంది. తప్పు చేసిన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, అలాగే భవిష్యత్తులో జరిగే నిరసనల కోసం దేశవ్యాప్త మార్గదర్శకాలను రూపొందించాలని పిటిషనర్లు కోరారు.
విచారణ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణన్ వాదిస్తూ… ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలకు సంబంధించిందని, మధ్యప్రదేశ్, నాగ్పూర్, బీహార్లతో సహా పలు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయని, ఇది కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదని కోర్టుకు తెలిపారు. ఇలాంటి అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు.
Also Read:TTD:ఆగస్టులో విశేష పర్వదినాలు
దీనిపై సీజేఐ స్పందిస్తూ… దాఖలైన పిటిషన్లలో రకరకాల ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే స్తృత కోణంలో చూస్తే… పెల్లెట్స్ వాడటం వల్ల 19 ఏళ్ల యువకుడు చూపు కోల్పోయాడు. ఎలక్ట్రిక్ లాఠీల వాడకానికి సంబంధించిన సంఘటనలు కూడా నమోదయ్యాయి. ఒక యువతి ఐసీయూలో చేరాల్సి వచ్చింది. మేకులు ఉన్న లాఠీలను ఉపయోగించడం వల్ల ప్రాణాంతక గాయాలు అయ్యాయని కూడా ఆరోపణలు ఉన్నాయి అని ఆయన అన్నారు.

