బ్యాంకాక్లోని ఓ పబ్లో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేలోపే కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు వీడియోలలో, నా లాడ్ప్రావో పబ్ ప్రధాన ద్వారం నుండి భారీ మంటలు, దట్టమైన నల్లటి పొగలు రావడం కనిపిస్తోంది.
బ్యాంకాక్లోని చతుచక్ జిల్లాలో ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన వినోద వేదికలలో ఒకదానిలో ఈ ప్రమాదం జరిగింది. జెరూసలేం పోస్ట్ నివేదిక ప్రకారం, బాధితులు మంటల నుండి తప్పించుకోవడానికి పబ్ బాత్రూమ్ వైపు వెళ్లగా, అక్కడే చిక్కుకుని మరణించారు.
భవనాన్ని దట్టమైన నల్లటి పొగ కమ్మేయడంతో, ప్రాణాలు కాపాడుకోవడానికి జనాలు అటుఇటు పరుగులు తీస్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందికి దాదాపు అరగంట సమయం పట్టిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన తర్వాత పబ్ లోపల కాలిపోయిన టేబుళ్లు, కుర్చీలు, ధ్వంసమైన అంతర్గత భాగాలు ఫొటోల్లో కనిపించాయి.
ఈ ప్రమాదంలో 27 మంది మరణించారని, పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని థాయ్ ప్రధాన మంత్రి అనుతిన్ చార్న్విరాకుల్ ఘటనా స్థలంలో విలేకరులకు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు.
Also Read:ఓ.! సుకుమారి..ఫ్యామిలీ ఎంటర్టైనర్!
పబ్లో ప్రదర్శన ఇస్తున్న ఒక సంగీత విద్వాంసుడు (మ్యుజీషియన్) తనకు తెలిపిన వివరాల ప్రకారం… పవర్ కట్ అవ్వడానికి ముందు స్టేజ్ పక్కన ఉన్న సర్క్యూట్ బ్రేకర్ నుండి పొగలు రావడం చూశానని, ఆ తర్వాత పేలుడు శబ్దం వినిపించి, క్షణాల్లో పబ్ అంతా దట్టమైన పొగ కమ్మేసిందని ప్రధాని అనుతిన్ పేర్కొన్నారు.

