జానకమ్మ మృతి కలచివేసింది!

4
- Advertisement -

జానకమ్మ మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది అన్నారు మెగాస్టార్ చిరంజీవి. నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.నా కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు…ఆ జ్ఞాపకాలు… మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి అన్నారు.

జానకమ్మ ఒక గాయని మాత్రమే కాదు… భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం… ఒక అనుభూతి… ఒక జీవితకాలపు అనుబంధం. ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది.శ్రీమతి ఎస్. జానకి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.జానకమ్మ … మీ స్వరం ఎప్పటికీ అమరం అన్నారు.

గాన కోకిల, లెజెండరీ సింగర్ ఎస్. జానకి అమ్మ ఇక లేరనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అన్నారు నందమూరి బాలకృష్ణ. తన మధురమైన గళంతో దశాబ్దాల పాటు కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన జానకి అమ్మగారు ఇక లేరనే వార్త యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. మా నాన్నగారు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి చిత్రాలతో పాటు.. నా చిత్రాల్లోనూ ఆమె పాడిన ఎన్నో అమర గీతాలు ఎప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉంటాయి. మా కుటుంబంతో ఆమెకు ఎంతో దశాబ్దాల అనుబంధం ఉంది.తన అద్భుతమైన గాత్రంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర వేసిన జానకి అమ్మగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు మరియు అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు బాలయ్య.

Also Read:గాయని ఎస్ జానకి కన్నుమూత

- Advertisement -