దేశంలో పురుషుల కంటే మహిళలే ఉత్తమ డ్రైవర్లు అని తేల్చింది ఓ నివేదిక. జునో (Zuno) రోడ్ సేఫ్టీ రిపోర్ట్ 2026 ప్రకారం.. డ్రైవింగ్ చేసేటప్పుడు వయసు, లింగం కంటే వారి ప్రవర్తనా అలవాట్లే ఎక్కువ ప్రభావం చూపుతున్నాయని..రాత్రి ‘9 PM – 10 PM’ సమయం భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రైవింగ్ సమయమని తేలింది.
మీరు గనుక భారతదేశంలో రాత్రి 9 గంటల నుండి 10 గంటల మధ్య ప్రయాణిస్తుంటే, మీరు రోజులోనే అత్యంత ప్రమాదకరమైన సమయంలో ప్రయాణిస్తున్నారని అర్థం. జునో జనరల్ ఇన్సూరెన్స్ నిర్వహించిన సరికొత్త సమగ్ర అధ్యయనం ‘ఇండియా రోడ్ సేఫ్టీ రిపోర్ట్ (IRSR) 2026’ ప్రకారం.. రాత్రి 8 గంటల తర్వాత డ్రైవింగ్ స్కోర్లలో తీవ్రమైన క్షీణత కనిపిస్తోందని, మధ్యాహ్న సమయంతో పోలిస్తే లేట్-ఈవినింగ్ డ్రైవింగ్ చాలా ప్రమాదకరంగా మారుతోందని వెల్లడించింది. దీనికి విరుద్ధంగా, రోడ్డుపై ప్రయాణించడానికి అత్యంత సురక్షితమైన సమయం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల మధ్య అని తేలింది. ‘జునో స్మార్ట్డ్రైవ్’ యాప్ టెలిమెట్రీ డేటా ఆధారంగా.. 17 రాష్ట్రాల్లోని 45 లక్షల ప్రయాణాలు మరియు 5.5 కోట్ల కిలోమీటర్ల డ్రైవింగ్ ప్రవర్తనను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు.
ఈ పరిశోధనల ద్వారా ఒక విషయం స్పష్టమైంది . రోడ్డు ప్రమాదాల ముప్పు అనేది కేవలం జనాభా వివరాలపై మాత్రమే కాకుండా, మనం ఎలా డ్రైవ్ చేస్తామనే దానిపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. నిజానికి దేశంలో జరుగుతున్న మొత్తం రోడ్డు ప్రమాదాలలో 80% కంటే ఎక్కువ ప్రమాదాలకు డ్రైవర్ల ప్రవర్తనా లోపాలే కారణం.
చాలా కాలంగా ఉన్న ఒక మూస పద్ధతిని (స్టీరియోటైప్) బద్దలు కొడుతూ.. సురక్షితమైన డ్రైవింగ్ విషయంలో పురుషులు, మహిళల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని టెలిమెట్రీ డేటా నిరూపించింది. మహిళలు సగటున 92.86 డ్రైవింగ్ స్కోర్ సాధించగా, పురుషులు 92.43 స్కోరుతో వారికి చాలా దగ్గరగా నిలిచారు.వాహనదారుల ప్రవర్తనలో అత్యంత బలహీనమైన పారామితులుగా ‘అకస్మాత్తుగా బ్రేకులు వేయడం’ మరియు ‘అతివేగంగా యాక్సిలరేట్ చేయడం’ గుర్తింపబడ్డాయి.ఇవి వరుసగా 87 మరియు 91 స్కోర్లను నమోదు చేశాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, భారీ రుతుపవనాలు లేదా శీతాకాలపు పొగమంచు వంటి మారుతున్న కాలాలు మొత్తం డ్రైవింగ్ స్కోర్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు, ఇవి ఏడాది పొడవునా ఒకేలా స్థిరంగా ఉన్నాయి.
భారతదేశం తీవ్రమైన రోడ్డు భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ఈ IRSR 2026 డేటా వెలువడింది. దేశంలో ఏటా సుమారు 1.73 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు, ఇది ప్రపంచ మొత్తం మరణాలలో దాదాపు 11 శాతానికి సమానం. ఇది దేశ జీడీపీ (GDP) లో 3-5 శాతాన్ని హరిస్తూ భారీ ఆర్థిక నష్టాన్ని మిగులుస్తోంది.
Also Read:వీడియో..రిల్స్ కోసం ప్రాణాలతో చెలగాటం
రోడ్డును ఉపయోగించే వారిలో అత్యంత బలహీనమైన వారే ఇందులో ఎక్కువగా నష్టపోతున్నారు. రోడ్డు ప్రమాద మరణాలలో ద్విచక్ర వాహనదారుల వాటా 44% కాగా, కాలినడకన వెళ్లేవారు (పెడెస్ట్రియన్స్) మరో 19% గా ఉన్నారు.స్టాక్హోమ్ డిక్లరేషన్ ప్రకారం.. 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50% తగ్గించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో జునో ఎండి మరియు సీఈఓ షనాయ్ ఘోష్ మాట్లాడుతూ.. కేవలం మౌలిక సదుపాయాలు (ఇన్ఫ్రాస్ట్రక్చర్) పెంచడం మాత్రమే సరిపోదని, సాంకేతికత ఆధారిత ప్రవర్తనా మార్పుల ద్వారానే దీనిని అరికట్టవచ్చని నొక్కి చెప్పారు.

