కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై ప్రశంసలు గుప్పించింది బీజేపీ. ఒక బీజేపీ ఎమ్మెల్యే ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తూ.. ఆయనకు “మహారాజులాంటి గౌరవం” ఇస్తామని హామీ ఇచ్చారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో తీవ్ర గందరగోళాన్ని, అంతర్గత కలహాలను రేకెత్తిస్తూ.. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్పై తన సొంత పార్టీ చేసిన ఒక ప్రధాన ఆరోపణను సింగ్ బహిరంగంగా తోసిపుచ్చిన తర్వాత ఈ నాటకీయ మార్పు చోటుచేసుకుంది.
ఉజ్జయినిలోని ‘వీర్ భారత్ న్యాస్’ ట్రస్ట్కు సంబంధించిన అక్రమాలపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. ముఖ్యమంత్రి కుటుంబం మరియు సహచరులకు ముడిపడి ఉన్న భూ లావాదేవీల నివేదికలను ప్రస్తావిస్తూ.. దాదాపు రూ. 500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం ఒక్క రూపాయికే ఆ ట్రస్ట్కు అప్పగించారని పట్వారీ ఆరోపించారు.
కానీ కొన్ని రోజుల తర్వాత దిగ్విజయ్ సింగ్ ఉజ్జయినిలో విలేకరులతో మాట్లాడినప్పుడు, ఆ వాదనను బహిరంగంగా సవాలు చేశారు. నా దగ్గర అన్ని సంబంధిత పత్రాలు ఉన్నాయి. ఆ భూమిని ఏ ప్రైవేట్ ట్రస్ట్కు ఇవ్వలేదు. అది ప్రభుత్వ ట్రస్ట్కే ఇవ్వబడింది అని సింగ్ చెప్పారు. సరైన పరిశోధన లేకుండా తాను ఏ అంశంపై కూడా వ్యాఖ్యానించనని ఆయన స్పష్టం చేశారు.
అలాగే తప్పుడు ఆరోపణలు చేసే దళారులకు కొదవలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యను చాలా మంది కాంగ్రెస్ నాయకులు తమ సొంత ప్రచారాన్ని కించపరిచేలా ఉందని భావించారు. అయితే ఆ వ్యాఖ్య ఒక జర్నలిస్ట్ను ఉద్దేశించి చేసినదే కానీ జితు పట్వారీని లేదా ఏ కాంగ్రెస్ సహచరుడిని ఉద్దేశించింది కాదని సింగ్ తర్వాత వివరణ ఇచ్చారు.
దిగ్విజయ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలను రాజకీయ ఆయుధంగా మార్చుకోవడానికి బీజేపీ అస్సలు సమయం వృధా చేయలేదు. అబద్ధం యొక్క ఆయుష్షు చాలా తక్కువ అని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను వారి సీనియర్ నాయకుడే పటాపంచలు చేశారని రాష్ట్ర బీజేపీ మీడియా ఇన్చార్జ్ ఆశిష్ ఉషా అగర్వాల్ ప్రకటించారు.గతంలో సింగ్పై తరచూ విమర్శలు చేసే బీజేపీ ప్రతినిధి డాక్టర్ హితేష్ బాజ్పాయ్, బహిరంగ ప్రకటనలు చేయడానికి ముందు అధికారిక పత్రాలను పరిశీలించినందుకు సింగ్ను అభినందించారు. హుజూర్ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ కూడా కాంగ్రెస్ ఆరోపణల్లోని బలహీనతను బయటపెట్టినందుకు సింగ్ను కొనియాడారు.ఆ తర్వాత అత్యంత ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ లోధి బహిరంగంగా సింగ్ను తమ పార్టీలోకి ఆహ్వానించారు.
ఆయనను అందరికీ సహాయం చేసే ఒక మంచి పెద్దాయన అని అభివర్ణిస్తూ.. కాంగ్రెస్లో ఇప్పుడు వారి అగ్రనేతలలో ఒకరైన సింగ్కు గౌరవం దక్కడం లేదని లోధి పేర్కొన్నారు. దిగ్విజయ్ సింగ్ బీజేపీలో చేరితే మేము ఆయనను మహారాజులా చూసుకుంటామన్నారు.
Also Read:తొలిసారి న్యూజిలాండ్కు మోదీ
బీజేపీ సింగ్ను ప్రశంసిస్తుంటే కాంగ్రెస్లోని కొన్ని వర్గాలు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నిధి చతుర్వేది…సదరు సీనియర్ నాయకుడు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని ఆరోపించారు. తన కుమారుడు జైవర్ధన్ సింగ్ రాజకీయ భవిష్యత్తును బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఇలా చేస్తున్నారని ఆరోపించారు.మాజీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ యాదవ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. అంతర్గత విభేదాల వల్ల బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము చేస్తున్న ప్రచారం పక్కదారి పడుతోందని హెచ్చరించారు.
నష్టం జరుగుతుందని గ్రహించిన కాంగ్రెస్ నాయకత్వం త్వరగా నష్టనివారణ చర్యలకు దిగింది. దిగ్విజయ్ సింగ్, జితు పట్వారీ ఇద్దరూ కలిసి విలేకరుల ముందుకు వచ్చి.. భూ అక్రమాలపై మోహన్ యాదవ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పార్టీ అంతా ఐక్యంగానే ఉందని సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

