‘యూజర్నేమ్’ ఫీచర్కు సంబంధించి ఐటీ మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ల స్పందనను కోరుతూ నోటీసులు పంపింది. వాట్సాప్కు కూడా ఇలాంటి నోటీసే పంపిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. మొబైల్ నంబర్లను పంచుకోకుండానే ప్లాట్ఫారమ్లపై కనెక్ట్ అవ్వడానికి వినియోగదారులను అనుమతించే ఈ ‘యూజర్నేమ్’ ఫీచర్ను ఎందుకు అనుమతించాలో తెలియజేయాలని టెలిగ్రామ్, సిగ్నల్లను ఐటీ మంత్రిత్వ శాఖ తన నోటీసులో కోరింది. అలాగే మోసాలు, బూటకపు గుర్తింపుల (ఇంపర్సనేషన్) గురించిన ఆందోళనలను వారు ఎలా పరిష్కరిస్తున్నారనే దానిపై కూడా ఈ రెండు ప్లాట్ఫారమ్లను వివరణ కోరింది.
వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త ‘యూజర్నేమ్’ ఫీచర్ వల్ల “గుర్తింపుల దుర్వినియోగం, మోసాలు” జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ బుధవారం మెటా సంస్థకు నోటీసు జారీ చేసింది. దీనిపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, ఐటీ మంత్రిత్వ శాఖకు సంతృప్తికరమైన సమాధానం ఇచ్చే వరకు ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురావద్దని మెటాను కోరింది.
సమాచార సాంకేతిక చట్టం, 2000 (IT Act), ఐటీ నియమాలు, 2021 (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) మరియు ఇతర చట్టాల ప్రకారం ఈ నోటీసు జారీ చేయబడింది.
ఈ ఫీచర్ అసలైన వ్యక్తులు లేదా సంస్థలను పోలి ఉండే యూజర్నేమ్లను సృష్టించుకోవడానికి అనుమతించడం ద్వారా… సాధారణ వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు, ఆర్థిక సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థల పేర్లతో మోసాలకు (ఇంపర్సనేషన్) పాల్పడటానికి మరియు గుర్తింపులను దొంగిలించడానికి దారితీయవచ్చు అని నోటీసులో పేర్కొన్నారు.
అనంతరం వాట్సాప్ స్పందిస్తూ… మోసాలు మరియు ఇంపర్సనేషన్లను అరికట్టడానికి తాము తగిన చర్యలు తీసుకున్నామని, తమ ప్లాట్ఫారమ్ను ఉపయోగించడానికి వినియోగదారులకు ఇప్పటికీ ఫోన్ నంబర్ అవసరమవుతుందని స్పష్టం చేసింది. అలాగే, మొదటిసారి మెసేజ్ పంపే వ్యక్తి కొత్త ఖాతానా, కాంటాక్టా, మ్యూచువల్ గ్రూప్ సభ్యుడా లేదా ఇతర దేశానికి చెందినవాడా అనే విషయాలను వినియోగదారులు స్పందించే ముందే వాట్సాప్ చూపిస్తుందని తెలిపింది.
Also Read:EPFO సంచలన నిర్ణయం
ఇతర వినియోగదారులు మీకు మెసేజ్ చేయాలంటే ఖచ్చితమైన యూజర్నేమ్ తెలిసి ఉండాలి. ఒక ఖాతా ఎంతమంది కొత్త వ్యక్తులను సంప్రదించవచ్చనే దానిపై మేము పరిమితి విధిస్తాము, ఎవరైనా యూజర్నేమ్ను పదే పదే ఊహించి టైప్ చేయడాన్ని అడ్డుకుంటాము. అలాగే మోసపూరిత ధోరణులను గుర్తించి తొలగించడానికి మా వద్ద ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయి అని మెటా యాజమాన్యంలోని ఈ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక టెలిగ్రామ్ విషయానికి వస్తే, ఈ ప్లాట్ఫారమ్ కొంతకాలంగా ప్రభుత్వ నిఘాలో ఉంది. లీక్ అయిన, నకిలీ నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్షా పత్రాల చలామణికి ఇది ఉపయోగపడుతుందనే ఆందోళనల నడుమ గత నెలలో ఈ ప్లాట్ఫారమ్పై వారం రోజుల పాటు నిషేధం విధించారు. ఆ నిషేధం జూన్ 22తో ముగియడంతో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.

