అధికార మార్పిడితో పశ్చిమ బెంగాల్ రాజకీయ, పరిపాలనా రంగాలలో ఒక భారీ మార్పు చోటుచేసుకుంటోంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) 15 ఏళ్ల పాలన ముగియడంతో రాష్ట్రంలో వేగవంతమైన మార్పుల పర్వం మొదలైంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం టాటా గ్రూప్ను మళ్లీ రాష్ట్రంలోకి తీసుకువస్తుందని ప్రకటించారు. పారిశ్రామికీకరణ పేరుతో గత లెఫ్ట్ ఫ్రంట్, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాలు అయితే బలవంతంగా భూములు లాక్కున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రంగానికి పూర్వవైభవం తీసుకువస్తామని హామీ ఇస్తూ.. సింగూర్, నందిగ్రామ్ ఉద్యమాలకు దారితీసిన తప్పులను మళ్లీ పునరావృతం చేయకుండా తమ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగాలను సృష్టిస్తుందని సువేందు అధికారి పేర్కొన్నారు.
పరిశ్రమలను ఆకర్షించే పేరుతో గత ప్రభుత్వం చేసినట్లుగా.. అబద్ధాలు చెప్పడం, ఫోటో సెషన్లు నిర్వహించడం వంటివి మేము చేయాలనుకోవడం లేదు అని చెప్పారు. ప్రభుత్వం ప్రస్తుతం తన భూసేకరణ విధానంపై కసరత్తు చేస్తోంది. గత లెఫ్ట్ ఫ్రంట్ పాలనలో సింగూర్, నందిగ్రామ్లలో జరిగినట్లుగా.. బలవంతపు భూసేకరణకు మేము పూర్తిగా వ్యతిరేకం. అదే సమయంలో, పరిశ్రమలు తెస్తున్నామంటూ కేవలం అబద్ధాలు ప్రచారం చేస్తూ ఫోటో సెషన్లు పెడుతూ ఏమీ చేయకుండా కూర్చునే టీఎంసీ విధానాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం అన్నారు.
హుగ్లీ జిల్లాలోని సింగూర్లో టాటా మోటార్స్ చేపట్టిన చిన్న కార్ల ప్రాజెక్ట్ (నానో కార్ ప్రాజెక్ట్).. బెంగాల్ రాజకీయ చరిత్రలోనే ఒక అత్యంత కీలకమైన ఘట్టంగా నిలిచిపోయింది. టాటా మోటార్స్ తన ప్రతిష్టాత్మక రూ. 1-లక్ష నానో కార్ల ఫ్యాక్టరీని స్థాపించడానికి వీలుగా సింగూర్లో 977 ఎకరాల భూమిని కేటాయిస్తామని అప్పటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం 2006లో ప్రకటించింది. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం స్థానిక రైతుల నుండి భూమిని సేకరించింది కానీ దాదాపు 2,000 మంది చిన్న భూస్వాములు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని అంగీకరించడానికి నిరాకరించారు. మమతా బెనర్జీ కూడా ఈ నిరసనల్లో చేరారు. ఆమెను సింగూర్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంతో కోల్కతాలో 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. నిరసనలు జరుగుతున్నప్పటికీ, రాష్ట్ర యంత్రాంగం సేకరించిన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయడం ప్రారంభించింది.
Also Read:ఎన్నారై కాదు..మార్గదర్శి!
ఒకవైపు నిరసనలు కొనసాగుతుండగానే టాటా మోటార్స్ ప్లాంట్ నిర్మాణాన్ని అధికారికంగా ప్రారంభించి దాదాపు రూ. 1,400 కోట్లు పెట్టుబడి పెట్టింది. అయితే నిర్మాణం పూర్తవుతున్న కొద్దీ నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఆందోళనకారులు దారులను దిగ్బంధించడంతో కార్మికులు లోపలికి వెళ్లలేకపోయారు. ఫ్యాక్టరీ గోడలను ధ్వంసం చేశారు.దీంతో విసిగిపోయిన టాటా మోటార్స్ చివరకు 2008లో పశ్చిమ బెంగాల్ నుండి పూర్తిగా తప్పుకుని తన నానో ప్రాజెక్టును గుజరాత్లోని సనంద్కు మార్చింది.

