ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని తెలిపారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. వాషింగ్టన్ మరియు న్యూఢిల్లీలు త్వరలోనే వాణిజ్య ఒప్పందంపై ఒక ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన తన మంచి మిత్రుడు అని అభివర్ణించారు.
ప్రధాని నరేంద్ర మోదీని మరోసారి మంచి మిత్రుడు అని పేర్కొంటూ… అమెరికా మరియు భారతదేశం తమ మధ్య వాణిజ్య ఒప్పందాన్ని త్వరలోనే ఖరారు చేసే అవకాశం ఉందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురువారం తెలిపారు. తాత్కాలిక ఒప్పందాన్ని ఖరారు చేసే లక్ష్యంతో అమెరికా ప్రతినిధి బృందం నాలుగు రోజుల భారత పర్యటనను ముగించిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీస్లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. గతంలో వాషింగ్టన్ విధానాలను న్యూఢిల్లీ అనుకూలంగా మార్చుకుని, భారీగా సుంకాలను విధించిందని ఆరోపించారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైందని… భారత్తో అమెరికా చాలా డబ్బు సంపాదిస్తోందని అన్నారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలపై వచ్చిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, “గతంలో వారు మా కంపెనీలపై భారీ మొత్తంలో సుంకాలు విధించారు, కానీ మేము వారి నుండి ఏమీ వసూలు చేయలేదు. ఇప్పుడు, పరిస్థితి దానికి పూర్తిగా వ్యతిరేకంగా మారింది, మేము భారత్తో చాలా డబ్బు సంపాదిస్తున్నాము” అని అన్నారు. “మేము ఒక ఒప్పందానికి వస్తాము, ఎందుకంటే నాకు మీ ప్రధానమంత్రి అంటే చాలా ఇష్టం. ఆయన నా మంచి మిత్రుడు. మా ఇద్దరి మధ్య సద్భావన ఉంది, మేము ఖచ్చితంగా ఒప్పందం చేసుకుంటాము అని ట్రంప్ స్పష్టం చేశారు.
పీఎం మోదీ..ట్రంప్ ల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఆ తర్వాత భారత్, అమెరికాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) మొదటి దశ రూపకల్పనను ఖరారు చేశాయి. రష్యా చమురును కొనుగోలు చేసినందుకు భారత్పై విధించిన 25 శాతం సుంకాలను అమెరికా తొలగించాలని, మిగిలిన లేవీలను 25 శాతం నుండి 18 శాతానికి తగ్గించాలని ఇందులో ప్రతిపాదించారు.
ట్రంప్ విధించిన పరస్పర సుంకాలకు వ్యతిరేకంగా అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో పరిస్థితి మారింది. దీనిని అనుసరిస్తూ, అమెరికా అధ్యక్షుడు ఫిబ్రవరి 24 నుండి 150 రోజుల పాటు అన్ని దేశాలపై 10 శాతం సుంకాలను విధించారు.
Also Read:కొత్త రూల్ తీసుకొచ్చిన UPSC!
ఏప్రిల్ & జూన్ చర్చలు: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, భారత్ మరియు అమెరికాలు ఈ ఒప్పందంపై పునఃసమీక్ష జరిపాయి. ఇందులో భాగంగా, వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం ఏప్రిల్లో చర్చల కోసం అమెరికాను సందర్శించింది. ఆ తర్వాత జూన్ 1 నుండి 4 వరకు, బ్రెండన్ లించ్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశంలో పర్యటించింది.
భారతదేశం ప్రకారం.. వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైంది, ప్రస్తుతం కొన్ని చిన్న చిన్న అంశాలపై మాత్రమే చర్చలు జరుగుతున్నాయి. వీటిని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కేవలం కామాలు మరియు ఫుల్ స్టాప్లు అని అభివర్ణించారు.

