కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. రూ. 2,000 కోట్లు మసాలా బాండ్ల ద్వారా సమీకరించిన తర్వాత ఆ నిధులను ఎలా వినియోగించారనే అంశంపై, అలాగే FEMA నిబంధనలు పాటించబడాయా లేదా అన్న దానిపై ఈ విచారణ జరుగుతోంది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, ముఖ్యమంత్రికి ముఖ్య ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎం. అబ్రహంలకు రూ. 466 కోట్ల షోకాజ్ నోటీసును విదేశీ మారకం నిర్వహణ చట్టం (FEMA) కింద జారీ చేసింది. ఈ విషయాన్ని అధికారులు సోమవారం ధృవీకరించారు.
వ్యక్తిగత హాజరు అవసరం లేని ఈ నోటీసును సుమారు 10–12 రోజుల క్రితం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇది FEMA నిబంధనల ప్రకారం జారీ అయ్యింది. FEMA కేసులలో విచారణ పూర్తయ్యాక జారీ చేసే షోకాజ్ నోటీసు, అందులో పేర్కొన్న ఉల్లంఘనలకు శిక్షార్హతను సూచిస్తుంది. కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డు (KIIFB) మసాలా బాండ్ల ద్వారా సమీకరించిన రూ. 2,000 కోట్ల నిధులు ఎక్కడ వినియోగించబడ్డాయి? అవి FEMA మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా? అనే అంశాలపై ఈ విచారణ సాగుతోంది.
KIIFB రాష్ట్ర ప్రభుత్వ పెద్ద, కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే ప్రధాన సంస్థ. 2019లో ఇది తొలి మసాలా బాండ్ జారీ ద్వారా రూ. 2,150 కోట్లు సమీకరించింది. రాష్ట్రంలోని ప్రముఖ మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ. 50,000 కోట్లు సమీకరించాలని ఉన్న ప్రణాళికలో భాగంగా ఈ బాండ్లు విడుదల చేయబడ్డాయి.
Also Read:అఖండ తాండవం..హై మూమెంట్స్!

