చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబరు 12 నుండి 14వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. అక్టోబరు 11న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయి.
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అక్టోబరు 12వ తేదీ ఉదయం 7 నుండి 9 గంటల వరకు చతుష్టానార్చన, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. అక్టోబరు 13న ఉదయం 7 నుండి 9 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 9 నుండి 10 గంటల వరకు పవిత్రసమర్పణ, సాయంత్రం పవిత్ర హోమాలు నిర్వహిస్తారు.
అక్టోబరు 14న ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహూతి, కుంభప్రోక్షణ, పవిత్ర విసర్జన, స్నపన తిరుమంజనం, చక్రస్నానం సాయంత్రం 6 గంటలకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.గృహస్తులు(ఇద్దరు) రూ.200/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, స్వామివారి తీర్థప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.
Also Read:Dude Trailer:‘డ్యూడ్’ ట్రైలర్

