తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వసతి కల్పించేందుకు నూతన కాటేజీ విధానాన్ని రూపొందించాలని అధికారులకు టిటిడి ఈవో జె. శ్యామల రావు సూచించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమలలో కాటేజీల నిర్వహణ కోసం నూతన విధానాన్ని తయారు చేయాలని కోరారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా దాతలు కాటేజీలు నిర్మించేందుకు వీలుగా విధాన పరమైన బ్లూ ప్రింట్ ను తయారు చేయాలన్నారు. అదే సమయంలో దాతలకు ప్రివిలేజస్, దాతలకు కల్పించిన సౌకర్యాల నిర్వహణ, గదుల నిర్వహణ, సుందరీకరణ, పచ్చదనం, పార్కింగ్, కాటేజ్ డిజైన్, కాటేజీలలో శ్రీవారి ఫోటో, పెయింటింగ్, భక్తి భావం ఉట్టిపడేలా గదుల నిర్మాణం తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని సూచించారు.
Also Read:ఆంధ్ర ‘కింగ్ తాలూకా’…ఫస్ట్ సింగిల్
నిర్దేశించిన సమయానికి దాతలు కాటేజీలను నిర్మించి టిటిడికి అప్పగించేలా, దాతలకు కేటాయించిన ప్రివిలేజేస్ దుర్వినియోగం కాకుండా చూడడం ,కాటేజీల నిర్మాణానికి దాతల ఎంపిక, విధి విధానాలు, బాధ్యతలు తదితర అంశాలు పారదర్శకంగా ఉండేలా నిబంధనలు రూపొందించాలన్నారు. అదే విధంగా కాటేజీల నిర్మాణం స్థిరంగా, సమాన ప్రాతిపదికన నిర్మాణం, నిర్మాణ సమయంలో నిబంధనలను అతిక్రమిస్తే స్పష్టంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను ముందుగా అంచనా వేసుకుని స్థిరంగా, శాశ్వతంగా ఉండేలా నిబంధనలు రూపొందించాలని ఈవో సూచించారు.

