ముంబైని ముంచెత్తిన వర్షం..వీడియోలు ఇవిగో

9
- Advertisement -

నైరుతి రుతుపవనాల రాకతో దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా తమిళనాడు, కేరళ, ముంబైలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా ముంబైలోని రవాణా వ్యవస్థలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. భారీ వర్షాలు రోడ్లపై ట్రాఫిక్‌ను నెమ్మదింపజేసి, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది.

ఈ నెల ప్రారంభంలో ప్రారంభించిన BKC-వర్లీ మార్గంలోని భాగమైన ఆచార్య అత్రే స్టేషన్ లో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి స్టేషన్‌ లో మోకాళ్లవరకూ నీరు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేసి సిబ్బందిని ఖాళీ చేయించారు.

ప్రయాణికుల సేవలు నిలిపివేయగా, వర్షాకాలం సమయంలో అండర్‌గ్రౌండ్ మెట్రో తగిన సన్నద్ధత కలిగి ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అయితే ఇప్పటివరకు ముంబై మెట్రో అధికారుల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్, స్టేషన్‌లోని నీరు నిలిచిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. భారీ ప్రచారం చేసిన అండర్‌గ్రౌండ్ మెట్రోకు మొదటి వర్షానికే నీరు చేరింది. పైకప్పు నుండి నీరు కురుస్తోంది. ఇది ఎంత ప్రమాదకరమో ప్రభుత్వానికి తెలుసా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలపై పునఃసమీక్ష నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.

BKC నుండి వర్లీ వరకు 6 స్టేషన్లు కలిగిన అండర్‌గ్రౌండ్ కారిడార్‌ను మే 10న ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రారంభించారు. మొత్తం 33.5 కిలోమీటర్ల పొడవుగల ఆక్వా లైన్ (కోలబా నుండి SEEPZ వరకు) ఆగస్టులో పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ దీనికి అధికారికంగా ప్రారంభోత్సవం చేయనున్నారు. లైన్ మొత్తం పూర్తయిన తర్వాత 27 స్టేషన్లు (26 అండర్‌గ్రౌండ్, 1 గ్రౌండ్ లెవెల్) ఉండేలా ప్లాన్ చేశారు. ఇది రోడ్ ట్రాఫిక్‌ను గణనీయంగా తగ్గించడంతో పాటు లోకల్ ట్రెయిన్‌లపై భారం తగ్గించనుంది.

ప్రస్తుతం, ఈ మార్గంలో 8 రైళ్లు ప్రతిరోజూ 244 ట్రిప్స్ చేస్తుండగా, ప్రతి 6 నిమిషాలు 20 సెకన్లకు ఒక రైలు అందుబాటులోకి వస్తోంది. టికెట్ చార్జీలు ప్రయాణ దూరంపై ఆధారపడి రూ.10 నుండి రూ.60 వరకు ఉన్నాయి. అయితే మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేకపోవడం ఒకటే మైనస్.

 

Also Read:GIC:హరితసేనలో వ్యాపారవేత్త సుధీర్

- Advertisement -