ఎంతటి వారైనా వదలము: కేటీఆర్‌

19
- Advertisement -

టీఎస్‌పీఎస్సీ లో జరిగిన పరీక్షల లీకేజీ విషయంపై నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. టీఎస్‌పీఎస్సీలో జరిగిన అవకతవకలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…టీఎస్‌పీఎస్సీ పటిష్టంగానే ఉందని కేవలం ఇద్దరు వ్యక్తుల వల్లే పేపర్ లీకేజీ జరిగిందన్నారు. నిరుద్యోగ యువత ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారంతా మళ్లీ పరీక్షలకు హాజరు కావొచ్చని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ప‌బ్లిక్ క‌మిష‌న్ ఏర్ప‌డిన త‌ర్వాత మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు 37 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఎగ్జామ్‌పై కూడా ఆరోప‌ణ‌లు రాలేదు. కంప్యూట‌ర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా 99 ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. నాలుగున్న‌ర ల‌క్ష‌ల మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాశారు. యూపీఎస్సీ ఛైర్మ‌న్ రెండుసార్లు తెలంగాణ‌కు వ‌చ్చి టీఎస్‌పీఎస్సీని సందర్శించిన విషయం గుర్తు చేశారు. దేశంలోని 13 రాష్ట్రాల ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ల చైర్మ‌న్లు కూడా మ‌న మార్పుల‌ను చేర్పుల‌ను అధ్య‌యనం చేసి వారి రాష్ట్రాల్లో అమ‌లు చేసేందుకు టీఎస్‌పీఎస్సీకి వస్తున్నారన్నారు. గతంలో 37 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశాం. ఒక్క ఆరోప‌ణ కూడా రాలేదు. గ‌తంలో ఇంట‌ర్వ్యూల్లో త‌ప్పులు జ‌రిగాయ‌ని టీఎస్‌పీఎస్సీ ర‌ద్దు చేసింది. రాత‌ప‌రీక్ష‌, మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉద్యోగ నియామ‌కాలు చేప‌డుతున్నాం అని కేటీఆర్ తెలిపారు.

రాష్ట్ర యువ‌తలో భ‌రోసా నింపాల్సిన బాధ్య‌త మా మీద ఉంది. క‌చ్చితంగా ప్ర‌వీణ్, రాజ‌శేఖ‌ర్ అనే ఇద్ద‌రు వ్య‌క్తులే కాదు.. వీళ్ల వెన‌కాల ఎవ‌రున్న త‌ప్ప‌కుండా వారిని క‌ఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఇది వ్య‌వ‌స్థ త‌ప్పు కాదు.. ఇది కేవ‌లం ఇద్ద‌రి త‌ప్పని… ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌డం వ‌ల్ల‌ ల‌క్ష‌లాది మంది పిల్ల‌ల‌కు ఇబ్బంది క‌లుగుతుందని మేం కూడా బాధ‌ప‌డుతున్నాం. స్థానికులకు 95శాతం రిజర్వేషన్లను కల్పించామని అన్నారు. పొరపాట్లను సరిదిద్దుతామని త్వరలో సంస్కరణలను తీసుకొస్తామని అని అన్నారు.

అభ్య‌ర్థులు ఎవ‌రూ మ‌ళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. వీలైనంత త్వ‌ర‌గా ఎగ్జామ్స్ నిర్వ‌హిస్తాం. ప‌క‌డ్బందీగా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తాం. అభ్య‌ర్థుల‌కు న్యాయం చేయాల‌నే ఉద్దేశంతో.. గ్రూప్-1, టీపీబీవో, డీఏవో, ఏఈఈ ఎగ్జామ్స్‌కు సంబంధించిన మెటిరీయ‌ల్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో పెడుతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్ట‌డీ స‌ర్కిళ్ల‌ను బ‌లోపేతం చేస్తాం. జిల్లాల్లో రీడింగ్ రూమ్స్ 24 గంట‌లు తెరిచి ఉంటాయి. ఫ్రీ మెటిరీయ‌ల్‌తో పాటు ఉచిత భోజ‌న వ‌స‌తి కూడా క‌ల్పిస్తాం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఇవి కూడా చదవండి…

అరెస్ట్ ఖాయమే.. వాట్ నెక్స్ట్ జగన్ !

పీఎం మిత్ర ..తెలంగాణలో మెగా టెక్స్‌టైల్స్‌

ఐ యామ్‌ బ్యాక్‌: ట్రంప్‌

- Advertisement -