గ్రీన్ ఇండియా సాధిస్తాం: ఎంపీ సంతోష్

152
- Advertisement -

ఆలోచనలను… అశయాలుగా మార్చి వాటి సాధనకు కృషి చేయటం ఉద్యమ కాలం నుంచి సీఎం కేసీఆర్ ఆచరణలో పెట్టారు. అదే స్పూర్తి నుంచి ప్రేరణ పొందుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా ములుగు ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ (FCRI) ములుగు ఆవరణలో సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. ఫారెస్ట్ కాలేజీలో విద్యను అభ్యసిస్తున్న వందలాది మంది విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలు మొక్కలు నాటడం ద్వారా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎంపీ అన్నారు.

అంతకుముందు బీడుగా ఉన్న రాష్ట్రాన్ని స్వరాష్ట్ర సాధన తర్వాత హరిత మయంగా మార్చాలని సంకల్పంతో సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని తీసుకున్నారని, దాని నుంచే స్ఫూర్తి పొంది తాను గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సంతోష్ కుమార్ తెలిపారు. గత ఐదేళ్లుగా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు, అన్ని వర్గాలకు చేరుకోవటం చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా ఆకు పచ్చని ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయని అన్నారు.

విదేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో మొక్కలు నాటడం గొప్ప విషయం అని అన్నారు. వేడుక ఏదైనా మొక్క నాటాలనే ఆలోచన ఇప్పుడు ప్రతీ ఒక్కరిలో తీసుకురావడంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొదటి విజయాన్ని సాధించిందని తెలిపారు.

ఆలోచనలను ఆచరణగా మార్చి లక్ష సాధన కోసం కృషి చేయడంలోనే నిజమైన విజయం ఉందన్న స్ఫూర్తిని బలంగా నమ్మడం వల్లనే గ్రీన్ ఇండియా చాలెంజ్ ను అన్ని వర్గాలకు దగ్గర చేయగలిగామని ఎంపీ తెలిపారు. తెలంగాణలో హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతం చేసుకుని అదే మాదిరిగా.. దేశవ్యాప్తంగా ఆకుపచ్చని ఉద్యమం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆ దిశగా గ్రీన్ ఇండియా చాలెంజ్ సమాజంలోని అన్ని వర్గాలను మరింతగా భాగస్వామ్యం చేసేలా కృషి చేస్తుందని ఎంపీ అన్నారు. ఇప్పటి దాకా స్వచ్ఛందంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, ఫారెస్ట్ కాలేజ్ డీన్ ప్రియాంక వర్గీస్, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్స్ కరుణాకర్ రెడ్డి, రాఘవ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -