తెలంగాణలో గత కొద్ది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు ఎట్టకేలకు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో వీఆర్ఏలు సమావేశమై చర్చలు సఫలం అయ్యాయని తెలిపారు. ఈ మేరకు సీఏం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్రావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సీఎస్ సోమేశ్ కుమార్తో జరిపిన చర్చలు సఫలం కావడంతో.. రేపట్నుంచి విధులకు హాజరవుతామని వీఆర్ఏల ప్రతినిధి వంగ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత సమస్యలను పరిష్కారిస్తామని రవీందర్ వెల్లడించారు. ప్రమోషన్లు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరామని, సీఎస్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. వీఆర్ఏల సమస్యలను ముఖ్యమంత్రి స్వయంగా చొరవ తీసుకొని పరిష్కరిస్తారని ఈసందర్బంగా సీఎస్ సోమేశ్కుమార్ హామీని ఇచ్చారని వంగ రవీందర్ రెడ్డి తెలిపారు.

