జీహెచ్ఎంసీ పరిధిలో నేడు ఎనిమిది డయాగ్నొస్టిక్స్ కేంద్రాలను ప్రారంభించామన్నారు మంత్రి ఈటల రాజేందర్. లాలాపేటలో కొత్తగా ఏర్పాటుచేసిన డయాగ్నొస్టిక్స్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఈటల… బస్తీ దవాఖానాల్లో పేదలకు ఉచిత వైద్య పరీక్షల కోసం డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నామని వెల్లడించారు.
డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్, రేడియాలజీ సహా 57 రకాల రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామన్నారు. పేదలకు రూపాయి ఖర్చులేకుండా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తమని చెప్పారు. త్వరలోనే మరో 8 డయాగ్నస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటుచేస్తామన్నారు.
ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని …గాంధీ దవాఖానలో రూ.35 కోట్లతో అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలో ల్యాబులు విజయవంతమైతే జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటివరకు రక్త, మూత్ర పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నది. కొత్తగా ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు, రేడియాలజీ పరీక్షలు కూడా అందుబాటులోకి రానున్నాయి.