గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ బేంగంపేటలోని మ్యారిగోల్డ్ హోటల్లో జరిగిన ‘వైబ్రంట్ హైదరాబాద్’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కేటీఆర్….అన్నపూర్ణ క్యాంటీన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలు అమలుచేస్తున్నామన్నారు. మంచినీటి సమస్యను 95 శాతం పరిష్కరించామని చెప్పారు.
బీజేపీ మత విద్వేషాలతో లబ్ధిపొందాలని చూస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ, ఎంఐఎం కూల్చివేస్తామంటున్నాయి కానీ.. నిర్మిస్తామనడం లేదని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ఒక్కపైసా తీసుకురాలేదని విమర్శించారు. గత ఆరేండ్లలో తెలంగాణ రూ.2.72 లక్షల కోట్లు కేంద్రానికి పన్నులు కట్టిందనీ, కేంద్రం మాత్రం రాష్ట్రానికి తిరిగిచ్చింది రూ.1.4 లక్షల కోట్లేనని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కరెంట్ కోతలకు వ్యతిరేకంగా పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారు. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కరెంట్ సమస్యను తీర్చామన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ముందుందని చెప్పారు. అత్యధిక విద్యుత్ వినియోగం అభివృద్ధికి సూచిక అని వెల్లడించారు.
రోజుకు 2 సెంటీమీటర్లకు మించి వర్షం పడితే హైదరాబాద్ జలమయం అవుతున్నదని, డ్రైనేజీ, సీవేజి వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతున్నదని చెప్పారు. త్వరలో నాలాలు విస్తరించి ముంపు సమస్యకు పరిష్కరిస్తామన్నారు. ముంబై సహా దేశంలోని అన్ని నగరాల్లో వరద సమస్య ఉందని చెప్పారు.