యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు..

247
cm kcr
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సందర్శించారు. బాలాలయంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. క్షేత్రాభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రికి అర్చకులు ఆలయ సంప్రదాయంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ ఆలయ ద్వారం బయట నుంచే దైవదర్శనం చేసుకున్నారు. అనంతరం పండితులు చతుర్వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈవో గీతారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలను సీఎంకు అందజేశారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రి జగదీశ్వరరెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎంపీ సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. 

స్వామివారి దర్శనం తర్వాత క్షేత్రాభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి సమీక్షిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని  అధికారులు సీఎంకు వివరించారు. ఆలయం చుట్టూ నిర్మిస్తున్న ఆరు వరుసల రింగ్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఘాట్ రోడ్డులో మొక్కల పెంపకం పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల మహాబలిపురం నుంచి తెప్పించిన విగ్రహాల అమరిక పనులు  పూర్తి చేస్తున్నారు. దర్శన సముదాయం, ప్రసాద కాంప్లెక్స్… శివాలయం, పుష్కరిణి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయానికి నలుదిక్కులా కృష్ణశిల రాతి విగ్రహాలు… సింహం, ఐరావతం, శంకు చక్రాలు, గరుత్మంతుని విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం దివ్య విమాన రాజగోపురానికి స్వర్ణకాంతులు అద్దనున్నారు. వీటితో పాటు ఆలయ నగరి, వీవీఐపీ వసతి కోసం ప్రెసిడెన్షియల్ సూట్స్, విల్లాల నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులన్నింటినీ ముఖ్యమంత్రి పరిశీలించి అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
అనంతరం వైటిడిఎ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు..

- Advertisement -