20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ..

276
20 lakh crore package
- Advertisement -

భారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ పరిణామాలపై జాతినుద్దేశించి మాట్లాడారు. మన ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాను మట్టుపెట్టాలిని ప్రధాని పిలుపునిచ్చారు. ఎన్నో వైరస్‌లను సమర్థంగా ఎదుర్కొన్న భారత్ కరోనాను కూడా దీటుగా ఎదుర్కొంటోందని ప్రధాని తెలిపారు.

ఈ విపత్కర సమయంలో భారత్ సామర్థ్యాన్ని తక్కిన ప్రపంచం కూడా నమ్ముతోందని, భారత ఔషధాలు ప్రపంచానికి వరంగా మారుతున్నాయని తెలిపారు. ప్రపంచానికి భారత్ యోగాను కానుకగా ఇచ్చిందని, నాడు 2000 సంవత్సరంలో వై2కే సమస్య ఉత్పన్నమైతే యావత్ కంప్యూటర్ ప్రపంచం తల్లడిల్లిపోయిన వేళ భారత నిపుణులు నిబ్బరంగా సమస్యను ఎదుర్కొన్నారని, ప్రపంచానికి దిశా నిర్దేశం చేశారని ప్రధాని వెల్లడించారు.

కాగా ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పేరుతో రూ. 20 లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని మోదీ ప్రకటించారు. రేపట్నుంచి ఆత్మ నిర్భర్‌ అభియాన్‌పై ఆర్థిక మంత్రి వివరాలు అందిస్తారని తెలిపారు. కరోనా కోసం ప్రభుత్వం చేసిన ప్రకటనలతో పాటు, ఆర్బీఐ నిర్ణయాలు అన్నీ కలుపుకుని ఆ ప్యాకేజీ విలువ సుమారు రూ. 20 లక్షల కోట్లు ఉంటుందన్నారు. మన దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ 10 శాతమని మోదీ చెప్పారు.

భారత్‌ సర్కార్‌ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడి, రైతు జేబులోకి నేరుగా వెళ్తుందన్నారు. ఈ ప్యాకేజీ ద్వారా కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలకు అనేక అవకాశాలు లభిస్తాయన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతం వస్తుందన్నారు. దేశంలోని ప్రతి పారిశ్రామికుడిని కలుపుకునిపోయేలా ప్యాకేజీ ఉంటుందని మోదీ పేర్కొన్నారు.

ప్రస్తుతం చాలా కీలక దశలో ఉన్నామని, స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనా నివారణ మార్గమని స్పష్టం చేశారు. ఇలాంటి సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదని, అయితే ఈ మహమ్మారిపై పోరాటంలో ఓడిపోవడానికి మనిషి సిద్ధంగా లేడని అన్నారు. కరోనా వైరస్ ఓ సందేశాన్ని తీసుకువచ్చిందని, బతకాలి, బతికించుకుంటూ ముందుకు సాగాలన్నదే ఆ సందేశం అని ప్రధాని మోదీ వెల్లడించారు.

- Advertisement -